Tuesday, 28 January 2020

*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-14*
*సీతను సరమ ఊరడించుట*
వానర రాజగు సుగ్రీవుడు ఫల, మూల, జలములు అధికముగా గల లంకా సముద్ర తీరమున సేనలను నిలిపెను. సేనాసహితముగా శ్రీరాముడు సముద్రమును దాటినపుడు రావణుడు శుక, సారణులను తన ఇరువురు మంత్రులతో వానర సేన యందు ప్రవేశించి వారి శక్తి, వారిలో ముఖ్యులు మొదలగు వివరములు తెలుసుకొనుమని ఆదేశిస్తాడు. వారు వానర సేనను ప్రవేశించగానే విభీషణుడు గుర్తు పట్టి వారిని శ్రీరాముడికి అప్పచెప్తాడు. వారి యొక్క దీనాలాపన విని సర్వ ప్రాణుల హితకారుడైన శ్రీరాముడు ఇట్లు పలికెను.
*పృచ్ఛమానౌ విముం చైతౌ చారౌ రాత్రి౦చరా ఉభౌ*
*శత్రు పక్షస్య సతతం విభీషణ వికర్షణౌ*  6 25 21
విభీషణా! ఈ ఇద్దరు రాక్షసులు రావణుని చారులు. ఇచటి రహస్యములను తెలుసుకొని శతృ పక్షము నందు తగవు పెట్టుటకై ప్రయత్నించు చున్నారు. వీరి గుట్టు తెలిసినది గావున వదిలి వేయుము. అంతట వారు శ్రీరామునికి జయము పలికి లంకాపురమునకు వచ్చి రావణునితో ఇట్లు పలికిరి.
*యాదృశం తస్య రామస్య రూపం ప్రహరణాని చ*
*వధిష్యతి పురీం ల౦కా౦ ఏక స్తిష్ఠన్తు తే త్రయః*  6 25 32
రాక్షసేశ్వరా! శ్రీరాముని రూపము, అతని అస్త్ర శస్త్రములు చూడ ఈ లంకాపురము నంతయు అతనొక్కడే భస్మీభూతము చేయగలడని తెలియుచున్నది. వానరులందరూ ఇప్పుడు యుద్ధమునకై ఉత్సుకతతో యున్నారు. కావున శ్రీరామునకు సీతను అప్పచెప్పి సంధి చేసుకునుడని శుకసారణులు చెప్పిరి. అప్పుడు రావణుడు ...
*యది మామ్ అభియు౦జీరన్ దేవ గన్ధర్వ దానవాః*
*నైవ సీతాం ప్రదాస్యామి సర్వ లోక భయా ద౭పి* 6 26 2
"దేవతలు, గంధర్వులు, దానవులు నాతో యుద్ధమొనర్చుటకు వచ్చినను, లోకమంతయు భయమును చూపసాగినను నేను సీతను ఇవ్వను" అని నిశ్చయముగా చెప్పెను. తదుపరి రావణుడు మహాబలవంతుడు, మహామాయావి, మాయావిశారదుడు అగు విద్యుత్ జిహ్వ ను వెంట పెట్టుకొని సీత ఉన్న ప్రమాదానవనమునకు పోయి మాయ ద్వారా సీతను మోహ పెట్టుటకై శ్రీరాముని మాయా శిరస్సును తీసుకొని వెళ్లి, శ్రీరాముడు ఇక లేడు గావున వశము కమ్మని సీతతో రావణుడు పలికి వెళ్లిపోయెను. రావణుడు వెళ్ళిపోగానే మాయాశిరస్సు అదృశ్యమయ్యెను. అప్పుడు "సరమ" (సరమ శైలూషుడు అను గంధర్వుని కుమార్తె, విభీషణుని భార్య. సీతాదేవికి సన్నిహితురాలు)అను రాక్షసి సీతకు ధైర్యము నూరిపోయుచు ఇట్లు పలికెను.
*న శక్యం సౌప్తికం కర్తుం రామస్య విదితాత్మనః*
*వధ శ్చ పురుష వ్యాఘ్రే తస్మి న్నై వోపపద్యతే*  6 ౩౩ 9
శ్రీరాముడు ఆత్మజ్ఞుడు. వారు సర్వజ్ఞుడైన పరమాత్మ. నిద్రించుచున్న వారిని వధించుట ఎవనికిని ఏవిధముగాను సంభవము గాదు. పురుష సింహుడగు శ్రీరాముని విషయమున ఈ ప్రకారమైన వధను గూర్చిన సంగతి యుక్తియుక్తముగా లేదు. రావణుని బుద్ధి, కర్మ రెండును చెడ్డవి. అతడు సమస్త ప్రాణులకును విరోధియు, కౄరుడును, మాయావియు అయి ఉన్నాడు. అతడు మీపై (సీతపై) ఈ విధమైన మాయను ప్రయోగించెను. నేను స్వయముగా లక్ష్మణ సహితుడగు శ్రీరాముని దర్శనము గాంచితిని. వారు సముద్ర తీరమున బస చేసి సుసంఘటితములైన తమ సేనలతో సురక్షితముగా యున్నారు. రావణుని వచనములచే బాధ నొందిన సీతకు సరమ తన పలుకులచే ఆహ్లాదమును కలుగ చేసెను. పిమ్మట శత్రునగరముపై విజయమును పొందు మహాబాహువగు శ్రీరాముడు శంఖధ్వని మిశ్రితమగు గొప్ప భేరి శబ్దముతో లంకపై ఆక్రమణము సల్పెను. ఆ భేరినాధమును విన్న రావణుడు మంత్రులనందరిని ఉద్దేశించి చెపుతూ .. "రాముని పరాక్రమములను గూర్చి వింటిమి అలాగే మీరు కూడా వీరులు అని చెప్పెను". అప్పుడు మాల్యవంతుడు (రావణుని బంధువు) ఈ ప్రకారముగా చెప్పెను.
*సందధానో హి కాలేన విగృహ్ణం శ్చ అరిభి స్సహ*
*స్వపక్ష వర్ధనం కుర్వన్ మహ దైశ్వర్య మ౭శ్నుతే*    6 35 8
*ధర్మో వై గ్రసతేఽధర్మం తతః కృత మ౭భూ ద్యుగమ్*
*అధర్మో గ్రసతే ధర్మం తత స్తిష్యః ప్రవర్తతే*            6 35  14
*త త్తు మాల్యవతో వాక్యం హిత ముక్తం దశాననః*
*న మర్షయతి దుష్టాత్మా కాలస్య వశమాగ౭౭తః*      6 36 1
సమయానుసారము అవసరము గలిగినప్పుడు శత్రువులతో గూడ సంధి, విగ్రహము చేయువాడును, తన పక్షము యొక్క అభివృద్ధి యందు లగ్నమై యుండు వాడును గొప్ప ఐశ్వర్యమును పొందగలడు. కావున రావణా! శ్రీరామునితో సంధి చేసుకొనుటయే నాకు ఉత్తమముగా తోస్తున్నది. ఎవతెకొరకై నీపై ఆక్రమణ జరుగుచున్నదో అట్టి సీతను రామునికి ఇచ్చివేయుము. కృతయుగము వచ్చినప్పుడు ధర్మము బలముగలదై అధర్మమును కబళించి వేయును. కలియుగములో అధర్మమే ధర్మమును అణచి వేయును. దుష్టాత్ముడైన రావణుడు కాలమునకు వశమగుతున్నాడు. కావున మాల్యవంతుడు చెప్పిన హిత వచనములు రావణుడు సహించ కుండెను. తదుపరి మంత్రులతో కూడి రావణుడు పరస్పరము విచారణ చేసి తత్కాలమున లంక యొక్క రక్షణను గూర్చిన ఏర్పాటు చేసెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

యుద్ధ కాండము-13

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-13
సేతు నిర్మాణములోని యోగ రహస్యము
 
రావణుని యుద్ధ సన్నాహములను చూచినవాడై ఇటు రాముడు కూడా తగినట్లుగా యుద్ధసన్నాహము ప్రారంభించెను. ముందుగా సాగరమును దాట వలెను. ఇది భవ సాగరము.  ధ్యాన మార్గము ద్వారా సాధించుటకై రాముడు దక్షిణ సాగర తీరము నందు కుశాసనముపై ఆసీనుడై మూడు దినములు, మూడు రాత్రుళ్ళు గహన ధ్యాన సమాధి అవస్థ యందు గడిపెను. అయినను మనస్సు శాంతించలేదు. భగవద్గీత షోడశోధ్యాయములో సాధకుని సత్వగుణము భగవానుడు ఈ విధముగా తెలియ జేయుచున్నాడు.
 
అభయం సత్వసంశుద్ధి ర్ జ్ఞానయోగవ్యవస్థితిః
దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్||
 
అహింసా సత్యమక్రోధ స్త్యా గశ్శాన్తిరపై శునమ్
దయాభూతే ష్వ లోలత్వం మార్దవం హ్రీరచాపలమ్||
 
తేజస్సమా దృతిశ్శౌచమద్రోహోనాతిమానితా
భవంతిసంపదందైవిమభిజాతస్యభారత ||
 
భయము లేకుండుట, అంత్ఃకరణశుద్ధి, జ్ఞానయోగమునండుట, దానము, బాహ్యేంద్రియనిగ్రహము, ఇతరుల యందు దోషములను చూడకుండుట, దయకలిగి యుండుట, విషయముల యందు ఆసక్తి లేకుండుట, మృదుత్వము, ధర్మవిరుద్ధమగు కార్యములు చేయకుండుట, చంచల స్వభావము లేకుండుట, జ్ఞానయజ్ఞము, శాస్త్రాదుల అధ్యయనము, తపస్సు, రుజుత్వము, ఏప్రాణికి బాధ జేయకుండుట, నిజము పలుకుట, కోపములేకుండుట, త్యాగబుద్ధి కలిగి యుండుట, శాంతి స్వభావము, ప్రతిభ,  బ్రహ్మతేజస్సు, ఓర్పు, ధైర్యము, బాహ్యాంతర శుచిత్వము, ఎవనికిని ద్రోహము చేయకుండుట, స్వాతిశయము లేకుండుట ఇవన్నియు సద్గుణములు. సాధకుడు ఈ ఇరువది ఆరు సద్గుణములను అలవరచుకొనవలెను. పట్టువదలని ప్రయత్నముచే చివరకు రాముని మనస్సు శాంతించి సమాధి అవస్థను పొందెను. అయినను సంసార రూప సాగరమును దాటలేక పోయెను. రాముడు తన ధనుస్సు యందు బాణమును ఎక్కుపెట్టి సంసార రూప సాగరమును వధించుటకై సిద్దపడెను అయినచో ఆ ధనస్సు, శరములనగా ఇవి ఎట్టివి? ఎటువంటి సాగరముపై వాటిని వదలవలెను. "ప్రణవో ధను: శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే" (సాధనారూప) ప్రణవ రూప ధనుస్సుతో ఆత్మరూప శరమును ఎక్కుపెట్టి బ్రహ్మరూప లక్ష్యముపై గురిపెట్ట వలెను. రాముడు ఆ విధముగా చేయ దలఁచెను. దానితో సంసార రూప సాగరము భీతి నొంది రాముని చరణములపై పడెను. అనగా రాముడు సంసార సాగరమును జయించెను. ఇక అట్టి సాగరముపై వారధి కట్టి వానర సేనతో సహా దాటవలసి యున్నది. ఏ వారధి? ఎటువంటి వానరులు? ఏ లంకపై ఆక్రమణ చేయుదురు?
పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి మాటలలో
 
సేతుం బధ్వా సుజలధౌ సాధనాశ్మ భిత్కటైహ్,
తతోభవాబ్ధి ముల్లంఘ్య దీప జ్ఞానాగ్నినాభృశమ్.
సూక్ష్మే దెహాఖ్యలంకాంచ దగ్దవోపనిషధ స్రతః,
కామక్రోధాది రక్షామ్సి హత్వాబుద్ధే సహస్రతః.
 
ఆంతర్యమేమన, సాధనా రూప రాళ్ళ ద్వారా వారధి కట్టి సంసార రూప సాగరమును దాటవలెనని, తన వృత్తి రూప వానరులను సేతువుపై నడిపి మాయారూప లంకలో నివసించెడి కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాది రాక్షసులను సంహరించవలెనని రాముడు తలఁచెను. ప్రారంభమున రాముడు సాగరముపై బాణమును వేయుదమనుకొనుసరికి సంసార రూప సాగరము రామునికి వశమై శరణు వేడెను. క్రోధ రూప బాణమునకు గాక, సాధనారూప రాళ్లతో వారధి కట్టి లంకను ఆక్రమించుమని చెప్పెను. నలుడను ఇంజినీరు ఆ వానరులలో ఒకడు. "అనల" అనగా అగ్ని. అనలము కానిది "నల" అగ్ని లేదా తేజస్తత్వమునకు మనకు క్రింద నున్న అపతత్వ సాధకుడు నలుడు. అపతత్వ మనగా అణురచనావస్థ లేదా ఎలక్ట్రానిక్ అవస్థగా చెప్పవచ్చు. అనేక ఎలెక్ట్రానుల సాపేక్ష సంధానము ద్వారా పరమాణువు తయారగును. ఆ పరమాణువే వాస్తు రూప జడ జగత్తుకు మూలము. విస్తారమైన జడజగత్తు యొక్క మూలావస్థయే అపతత్వము. సాధనా రూప రాళ్ళతోనే భవసాగరము దాటవలెను. అపతత్వము ద్వారానే జగత్తు నందలి సాధనలు ప్రారంభమగును. రామరూప సాధకుడు భవ సాగరమును దాటుటకు నలుడను అపతత్వ ఇంజినీరు సాధనారూప రాళ్లతో సేతువును నిర్మించును. రామాయణము నందు ఎటువంటి యోగ విజ్ఞాన రహస్యము దాగి యున్నదో ఉత్కృష్ణ సాధనానుభవము ద్వారాను, పరిణామము చెందిన బుద్ధి ద్వారాను అటువంటి రహస్యములు అవగాహనకు వచ్చును. ఈ ఆంతర్యము సాధారణ సమాజమునకు ప్రకటితమవాలి. మహాపరాక్రముడు, తేజస్వి అయిన నలుడు సంసార సాగరమును దాటుటకు వారధిని నిర్మించిన మహాసాధకుడు.

ఐదు దినములలో ఈ సేతువు నిర్మింపబడెను. పంచతత్వముల ద్వారానే ఈ ఘటన లేదా కార్యము గావించబడెను. పంచతత్వ సాధనతో ఈ ఐదు దినముల ప్రణాళిక రచించిరి. దానిపై వృత్తి రూప వానరులు దాటుట ప్రారంభించిరి. రాముడు సంతోషించెను. అటువంటి సేతువును రాక్షస వృత్తులు ఆటంక పరచకుండా విభీషణుడు ఆవలి వైపున తన సత్ వృత్తి రూప శూలముతో నిలుచుండెను. ఇదియే ఈ సేతువు నిర్మాణములోని యోగ రహస్యము.   
శ్రీరామ జయరామ జయజయ రామ

యుద్ధ కాండము-12

శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-12
సముద్రముపై సేతువును నిర్మించుట
సముద్రుడు చెప్పిన పిమ్మట నలుడు రామునితో ఇట్లు పలికెను. మందర పర్వతము నందున్న మా తల్లిని ప్రేమించి ఆమె యందు తన అంశచే నేను జనియించగా మా తల్లికి విశ్వకర్మ వరమొసగినాడు కావున నేను సేతువును నిర్మింప గలను. అందుకు వానరులందరూ సేతువు నిర్మాణమునకు సహకరింతురు" అని చెప్పగనే శ్రీరాముడు సేతువు నిర్మాణమునకు ఆజ్ఞాపించెను. అంత పర్వత సదృశులైన వానరులు అడవులలోని అనేక రకములైన చెట్లు, పెద్ద పెద్ద పాషాణములు, పర్వతములు సముద్రములో పడవైచిరి. కొందరు నూరు యోజనముల సముద్రముపై మార్గ నిర్ధేశము చేయుచు సూత్రము కట్టిరి. పర్వత శిఖరములను మొదలగు వాటిని ఎత్తి పడవైచి మధ్యలో కర్రలను, గడ్డిమొక్కలను వేసి బంధించిరి. నిర్మాణము మొదలిడిన మొదటి రోజున పదునాలుగు యోజనములు, రెండవ రోజున ఇరువది యోజనములు, మూడవ రోజున ఇరువది ఒక్క యోజనములు, నాలుగవ రోజున   ఇరువది రెండు యోజనములు ఐదవ రోజున ఇరువది మూడు యోజనములు నిర్మాణము చేసిరి. ఈ విధముగా నూరు యోజనముల పొడవు, పది యోజనముల వెడల్పుతో సేతు నిర్మాణము సమాప్తము చేసిరి. అది ఆకాశమున స్వాతీ పథము[1] వలె దర్శనీయముగా యుండెను. విభీషణుడు సచివులతో గూడి గదాపాణియై సముద్రము ఆవల శత్రుపక్షము నుండి కాపాడు చుండెను. సేతువు పూర్తి అయిన పిమ్మట రాముడు హనుమ భుజములపై, లక్ష్మణుడు అంగదుని భుజములపై కూర్చుని ధనుర్ధారియై సేనకు అగ్రభాగమున నిలిచి ముందుకు సాగెను.
Dr. Vedhavyasa, IAS, తన "శ్రీరామ చరితామృతము" గ్రంథములో రామాయణములోని లంకకు, ప్రస్తుతము మనకు కనిపించే సింహళ ద్వీపమైన శ్రీలంకకు సంబంధము లేదని పరిశోధనాత్మక చారిత్రాత్మక ఆధారములతో నిరూపించారు. అవి ఒక్కసారి గమనిద్దాము. రామాయణములో ఎక్కడ "సింహళము" అనే పేరు కనబడదు. వ్యాస మహర్షి రచించిన సంస్కృత భాగవత పురాణములో సింహళము వేరుగాను, లంక వేరుగాను వర్ణించబడినది. వాల్మీకి రామాయణము కిష్కింధ కాండ నాలుగవ సర్గలో సుగ్రీవుడు సీతను వెతుకుట కోసము హనుమాధులను దక్షిణ దిక్కుకు పొమ్మనెను. దక్షిణము నకు పోవు మార్గము తెలియ జేస్తూ వింధ్య పర్వత శ్రేణి మొదలుకొని దక్షిణ దిక్కుగా కన్యాకుమారి అగ్రము వరకు చేరవలెను. ఆ తర్వాత నూరు యోజనముల సముద్రమును దాటిన తర్వాత లంకకు చేరవచ్చును. దక్షిణ సముద్రము తాకు చోట మహేంద్రగిరి అను పర్వతము గలదు. హనుమ లంకకు ఆ పర్వతము నుంచియే మొదలిడెను. దానిని బట్టి చూడగా పోవలసిన దారిలో మహేంద్ర పర్వతము ముఖ్యమైన కొండ గుర్తు. పశ్చిమ కనుమలలో అరేబియా సముద్రము తీరము పొడవునా గల పర్వత పంక్తులలో మహేంద్ర పర్వతమే ఆఖరిది. దీనికి జరిగిన ముందు సంఘటనలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శ్రీరాముడు వాలి వధ తర్వాత ప్రస్రవణ పర్వతము (గిరి) వద్ధ నాలుగు నెలలు ఒక కొండ గుహలో యున్నాడు.  ఇది కిష్కింధకు పశ్చిమముగా అనగా కర్ణాటక రాష్ట్రములోని హాస్పెటకు ఎనిమిది మైళ్ళ దూరములో పదిహేను డిగ్రీల ఉత్తరముగా ప్రస్రవణగిరి అంచులు యున్నవి. ఈ కొండల్లో ఉత్తరంగా యున్న పర్వత శ్రేణిని "వింధ్య పర్వత శ్రేణి" అని పేరు. దీనిని బట్టి చూడగా పశ్చిమ కనుమలను నాలుగు భాగాలుగా చేయగా పదిహేను డిగ్రీల ఉత్తర కొండలను వింధ్య పర్వత శ్రేణి అని, పదిహేను డిగ్రీల దక్షిణంగా పాలఘాట్ లోయల వరకు కొండలను సహ్యాద్రి శ్రేణి అని, పాలఘాట్ నుండి తామ్రపర్ణి నది వరకు వరకు గల కొండలు మలయ పర్వత శ్రేణి అని తామ్రపర్ణి నది నుండి దక్షిణ సముద్రము వరకు వ్యాపించి యున్న పర్వత శ్రేణులకు మహేంద్ర పర్వత శ్రేణి అని చెప్పబడినది. ఈ మహేంద్ర పర్వతము కన్యాకుమారి వద్ద నుండి సముద్రములో కలియు చున్నది. ఇక్కడ నుండి నూరు యోజనములు రావణ పాలిత లంక. నూరు యోజనములు దూరము అనగా ఎంత? జ్యోతిష శాస్త్రము మరియు ఖగోళ గణిత శాస్త్రము లలో తెలిపిన మానమును బట్టి ఒక్క యోజనము 4.92 మైళ్లకు సమానము. అంటే నూరు యోజనములు 492 మైళ్లకు సమానము. భూమధ్య రేఖ నుండి కన్యాకుమారి అగ్రము ఎనిమిది డిగ్రీల దూరములో కలదు. కావున ఒక డిగ్రీకి అరువది తొమ్మిది (69 ) మైళ్ళు కాబట్టి కన్యాకుమారి నుండి 552 మైళ్ళ దూరములో భూమధ్య రేఖ కలదు. కావున లంక ఈ భూమధ్య రేఖకు ఉత్తరంగా ప్రారంభమై అక్కడ నుండి దక్షిణంగా వ్యాపించి యున్నది. కానీ ఇప్పటి శ్రీలంక అనే సింహళ దేశము కన్యాకుమారి అగ్రమునకు తిన్నగా దక్షిణముగా గాకుండా కొంచెము తూర్పుగా యున్నది.  ఇంతే గాక యుద్ధకాండము నాలుగవ సర్గలో దండయాత్రకు సంబంధించిన వివరణ ఇస్తూ శ్రీరాముడు వానర సేనతో కిష్కింధ నుండి పశ్చిమంగా ప్రయాణము చేసి దక్షిణంగా యున్న సహ్యాద్రి పర్వత శ్రేణిని, అక్కడ నుంచి దక్షిణంగా మహేంద్ర పర్వతములను దాటి సముద్ర తీరమునకు చేరెను అని చెప్తారు. అక్కడ నుంచి నలుడు తిన్నగా నూరు యోజనముల సేతువును నిర్మిస్తాడు. ఈనాటి రామేశ్వరము వద్ద కొండలుగాని, మహేంద్రగిరి పర్వత శ్రేణులు గాని లేవు. కావున శ్రీరాముడు నిర్మించిన సేతువు ఈనాటి రామేశ్వరము వద్ద కాదు. ఎందుకనగా రామేశ్వరము నుంచి సింహళమునకు దూరము ఏబది మైళ్ళ లోపే. జ్యోతిష్య శాస్త్ర గ్రంథములు చూడగా ఆర్యభట్టు, వరాహమిహరుడు, బ్రహ్మగుప్తులు లంకాపట్టణము భూమధ్యరేఖ వద్దనే యున్నట్లు వర్ణించబడినది. ఈ లంకాద్వీపము నిరక్షర రేఖకు సరిగ్గా నెత్తిమీద యున్నది. ఈనాటి సైన్సు లెక్కల ప్రకారము గ్రీన్విచ్ కు తూర్పుగా 77  డిగ్రీల వద్ద కన్యాకుమారి, ఉజ్జయిని, ఢిల్లీ యుండును. ప్రాచీన జ్యోతిష్యులు ఈ రేఖను "లంక రేఖ" గా చెప్పిరి. రావణాసురుని లంక రామాయణ కాలం తర్వాత జగత్ప్రళయము సంభవించి సముద్రములో మునిగిపోయినది. కాలానుగుణంగా యున్న నానుడిని బట్టి శ్రీరాముని ఆజ్ఞచే హనుమ సువర్ణమైన లంకను త్రేతాయుగము తర్వాత సముద్ర గర్భములో ముంచివేసెను.  జంబూద్వీప నవ వర్షములు ఈ క్రింద యీయబడిన రేఖాచిత్రము ద్వారా సూచించబడినది.
Note: ఈ రేఖా చిత్రం యొక్క పిడిఎఫ్ క్రింద అటాచ్ చేయబడినది.
శ్రీరామ జయరామ జయజయ రామ
[1] సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు ఆకాశమున పయనించు మార్గములను వాయు పురాణము మూడు విధములుగా పేర్కొనుచున్నది అవి క్రమముగా ౧. ఉత్తర మార్గము (అశ్వని, భరణి, కృత్తిక - నాగవీధి, రోహిణి, మృగశిర, ఆరుద్ర - గజవీధి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష - ఐరావతా వీధి), ౨. మధ్య మార్గము (మఖ, పుబ్బ, ఉత్తర - అర్షభీ వీధి, హస్త, చిత్త, స్వాతి - గోవీధి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ రాజగవీధి), ౩. దక్షిణ మార్గము (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ - అజవీధి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం - మార్గీ వీధి, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి - వైశ్వానరీ వీధి)

Sunday, 26 January 2020

యుద్ధ కాండము-11


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-11
శ్రీరాముడు సముద్రునిపై బ్రహ్మాస్త్రమును సంధించుట
 
హనుమ, సుగ్రీవుడు విభీషణునితో ఈ సాగరమును దాటుటకు అశక్యముగా యున్నది గావున తగిన ఉపాయము సూచించుమని కోరెను. సుగ్రీవుడు ఇట్లు పలుకగానే విభీషణుడు తనకు తెలిసిన ఉపాయము శరణాగతియే గావున రామచంద్రప్రభువు సముద్రుని శరణాగతి చేసినచో సముద్రుడు తప్పక దారి ఇచ్చునని అంతియేకాక ఇక్ష్వాకు ప్రభువుల వలన తనకు కలిగిన మేలును గుర్తు పెట్టుకొని అయినా సముద్రుడు సహాయము చేయునని సూచించాడు.
 
అన్ని ఉపాయములు కంటే శరణాగతి తప్పక ఫలమును ఇచ్చెడిదే కానీ ఎవరు ఎవరిని చేయవలెను అను నియమము యున్నది. శ్రీరాముడు సర్వసమర్థుడు కనుక విభీషణుని శరణాగతి ఫలించింది. అంతియేగాక శ్రీరామునికి తనను తాను రక్షించుకోవడమే గాక సకల లోకములను రక్షించు సామర్థ్యము కలదు. సముద్రుని శక్తి శ్రీరాముని శక్తితో ఏ విధముగానూ సరిపోలదు. అటువంటప్పుడు శ్రీరాముడు సముద్రుని శరణాగతి చేయుట ఏ విధముగానూ సమర్థనీయము, ఆచరణ సాధ్యము కాదు. అయినను సుగ్రీవుని కోరిక మేరకే (సుగ్రీవుని చిన్నబుచ్చడము ఇష్టములేక) రాముడు సముద్రుని శరణు పొందుటకు నిశ్చయించుకొనెను. అప్పుడు రాముడు చిన్నచిన్న గులక రాళ్లతో, గండ్ర ఇసుకతో నిండిన సముద్ర తీరము నందు నేలపై దర్భలు పరచుకొని సముద్రునకు నమస్కరించి పరుండెను. సర్వలోకములను రక్షించు సమర్ధుడైన రాముడు, లోకులందరిచే రక్షణకై నమస్కరింపబడువాడైన రాముడు తన రక్షణకై సముద్రునకు నమస్కరించి ప్రాయోపవేశము చేయ సిద్ధపడెను. ఏవ ముక్తః కుశా౭౭స్తీర్ణే తీరే నద నదీపతేః సంవివేశ తదా రామో వేద్యా మివ హుతాశనః ఈ విధముగా మూడు రాత్రులు ఉపాసించెను. శరణాగతి స్వరూపమును లోకమునకు విశదీకరించుటకై ఆ విధముగా ఉపాశించినాడు గాని శక్తిలేక గాదు. మూడు రాత్రులు అయినను సముద్రుడు రాకపోవుటచే రాముడు క్రుద్ధుడాయెను.
 
ప్రశమశ్చ క్షమా చైవ ఆర్జవమ్ ప్రియవాదితా,
అసామర్థ్యం ఫలన్త్యేతే నిర్గుణేషు సతాం గుణాః  6.21.14

ఆత్మ ప్రశంసినం దుష్టం ధృష్టం విపరిధావకమ్
 సర్వత్రో త్సృష్ట దణ్డం చ లోకః సత్కురుతే నరమ్ 6.21.15
 
 న సామ్నా శక్యతే కీర్తి ర్న సామ్నా శక్యతే యశః
 ప్రాప్తుం లక్ష్మణ లోకేఽస్మిన్ జయో వా రణ మూర్ధని 6.21.16
 
చాపమ్ ఆనయ సౌమిత్రే శరాం శ్చా౭౭శీ విషోపమాన్
సాగరం శోషయిష్యామి పద్భ్యాం యంతు ప్లవ౦గమా:
అద్యా౭క్షోభ్య మ౭పి క్రుద్ధః క్షోభయిష్యామి సాగరమ్ 6.21.22
 
సత్పురుషులు మంచి గుణములు గలిగి యుందురు. ఓరిమి, ఇంద్రియ నిగ్రహము, మనోవాక్కాయములలో ఋజుత్వము, ప్రీతీ గలిగించు మాటలు వారికి సహజముగా యుండును. కానీ గుణహీనులు ఆ సత్పురుషుల మంచి గుణములను లెక్కజేయరు. వారిని అసమర్థులుగా జూతురు. చూడుము సముద్రుని గర్వము. క్రోధము లేకుండా ఎదుటి వారి అపరాధమును ఓర్చుకొనుచు ఎదుటి వారి మనసును అనుసరించి మాయలేక ప్రియముగా మాటలాడెడివాడిని అసమర్థులు అని తలతురు. ఎవడు తనను తాను స్తోత్రము చేసుకొనుచు తన గొప్పలు తానే చెప్పుకొనుచు ఇతరులను వంచించుతూ దయలేని వాడై తన దుష్టవ్యాపారములచే అందరూ తనను చూచి పారిపోవునట్లు చేయుచుండునో, మంచివారిని చెడ్డవారిని కూడా ఎవడు హింసించుచుండునో వానిని లోకము గౌరవించును. మంచి మాటలచే కీర్తి, యశస్సు రాదూ. పరాక్రమముచేతనే అది సిద్ధించును. లక్ష్మణా! నేను ఓర్చి నిరీక్షించుట వలన సముద్రుడు నన్ను చేతగాని వానిగా తలచుచున్నాడు. సౌమిత్రీ! నా ధనస్సును, విషసర్పముల వలే భయంకరములైన నా బాణములను అందించుము. క్షణములో ఈ సముద్రమును శుష్కింప చేయుదును. అప్పుడు వానరులు అందరూ నడచియే వెళ్ళగలరు. సముద్రము ఎన్నడూ శుష్కింపదు అనునది లోక ప్రశిద్ధి. దానిని వమ్ము చేసెదను. ఇట్లు పలికి రాముడు కోదండము చేపట్టి ప్రళయకాలములొ ప్రజ్వరిల్లుచున్న అగ్నివలె ఎవ్వరిచేతను చేరుటకు శక్యము కానివాడై వజ్రము లాంటి బాణములను సముద్రములోనికి వదిలెను. అప్పుడు మొసళ్ళు, తిమింగలములు మున్నగు భీకర సత్వములతో నిండిన ఆ మహాసముద్రము క్షోభించెను. లక్ష్మణుడు వారించినను ఆపకుండా శ్రీరాముడు అమోఘమైన శరమును సంధించి బ్రహ్మాస్త్ర మంత్రమును పాటించుతూ వింటినారిని లాగెను. అంతటా భూమ్యాకాశములు బ్రద్దలగుచున్నట్లు లోకమంతయు కంపించెను. ఆ మహాసముద్రము తన పరిధిని ధాటి ఒక యోజన పర్యంతము అతిక్రమించెను. సముద్రము కొన్ని యోజనముల వరకు లోలోపలకు పోసాగెను. అప్పుడు సముద్రుడు మధ్యభాగమున ఒక్కసారి పైకెగసి రాముని సమీపమునకు చేరి దోసిలి యొగ్గి ఇట్లు విన్నవించెను. "నేను జలములకు స్థానమగు సముద్రమును. అగాధముగా యుండుట నా స్వభావము. దాటుటకు శక్యము గాకుండా యుండుట నా లక్షణము.లోతు తగ్గి మెత్తగా యున్నచో అది నా స్వభావమునకు విరుద్ధము. ఒక కోరిక వలన గాని, లోభము వలన గాని, భయము వలన గాని నేను అగాధములగు జలములను మెరకగా చేయజాలను. కావున సేతువును నిర్మాణము చేసి నన్ను దాటవలెను. అట్టి సేతు నిర్మాణమునకు ఎట్టి విజ్ఞములు కలుగకుండా చేయగలను. నాకు ఉత్తరపు దిక్కున పవిత్రము అయిన ధ్రువకల్పము అనేది ప్రదేశము యున్నది. అక్కడ క్రూరకర్మలు చేయువారు పెక్కు గలరు. వారిపై నీ బాణమును ప్రయోగించుము. నీ సేనలో "నలుడు" అను వాడు విశ్వకర్మ కుమారుడున్నాడు. అతడు సముద్రముపై సేతువును నిర్మింపగలడు. దానిని నేను నిలిచి యుండేటట్లు చేయగలను" అని చెప్పిప్పి సముద్రుడు అంతర్థానము అయ్యాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ
 

యుద్ధ కాండము-10



శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-10

విభీషణుడు రావణుని బల సంపదలు తెలుపుట
శ్రీరాముడు అభయము ఒసగినాడని తెలియుట తోడనే విభీషణుడు, రామదాస్యము లభించిందనే మహా ఆనందముతో ఆకాశము నుండి నిలబడి సాష్టాంగము ఒనర్చినాడు. తనను ఆదరించి, తన యందు యున్న ప్రేమను ప్రకాశింప జేసినప్పుడు ఆనందము పట్టలేక ఆర్తితో పాలు త్రాగెడి శిశువు తల్లి పాలిండ్లమీదనే పడినట్లు రాముని పాదములపై పడినాడు. సర్వలోక శరణ్యాయ శ్రీరాఘవాయ మంగళం. రాముడు శరణాగతి చేయుటకు తగిన గుణములు గలవాడు. విభీషణుడు శ్రీరామునితో ఇట్లు చెప్పుచున్నాడు. రామా! నేను రావణుని తమ్ముడను. ఇట్లు అనుటచే భగవత్ప్రాప్తికి వలసిన యోగ్యత తనకు లేదేమోనని సూచించాడు. రావణుడు నన్ను అవమానించాడు. లోకములోని సకల ప్రాణులకు నీవే శరణమని, రక్షింప సమర్థుడని ఎరిగి నిన్ను శరణు పొందినాను. రావణునికి అతని అహంకారము వలన ఈ భాగ్యము కలుగలేదు. నీకంటే వేరొకటి పొందుటకు వేరే ఏమి లేదని జన్మభూమిని, మిత్రులను, కుటుంబమును, సకల సంపదలను వదలి వచ్చినాను. అప్పుడు రాముడు మృదుమధురంగా, ఓదార్చుతూ రాక్షసుల యొక్క బలాబలముల గురించి యథాతథముగా తెలియ చేయ వలసినదిగా అడుగుతాడు.

రాముడట్లు అడుగగానే విభీషణుడు రావణుని బలమును చెప్పుటకు ఆరంభించెను. రావణునకు సర్వావధ్యత్వము అనగా ఎవరి చేతను చావులేకుండా బ్రహ్మ వరమును ఒసగినాడు. గంధర్వులు, అసురులు, రాక్షసులు మొదలగు సర్వ భూతములచే అతడు అవధ్యుడు. రావణునికి తమ్ముడు, నాకు అన్న అయిన కుంభకర్ణుడు మహాయోధుడు, మహాబలశాలి. ప్రహస్తుడు రావణుని సేనాధిపతి. అతడు కుబేరుని సేనాధిపతియైన మణిభద్రుని ఓడించెను. ఇంద్రజిత్తు యుద్ధసమయము నందు చేతి వ్రేళ్ళకు బలమైన తొడుగులు దాల్చును.అతని కవచము అభేధ్యము. యుద్ధములో అతడు ఎదుటి వారికి కనబడకుండా మాయమగును. యుద్ధ సమయములో అదృశ్యుడై అగ్నిహోత్రుని హోమముచే తృప్తి పరచి వచ్చి శత్రువులను చంపును. ఇంకా రావణుని సైన్యములో ఇంద్ర, యమ, వరుణాది లోకపాలకులతో సమానులగు మహోదరుడు, మహాపార్శ్వుడు, అకంపనుడు మొదలగు వారున్నారు. అంతియే గాక కోట్లకొలది రాక్షసులు కామరూపులు, రక్తమాంసములను భక్షించువారు. రావణుడు లోకపాలకులను, దేవతలను జయించెను.
 
ఏవ ముక్త స్తు సౌమిత్రి ర౭భ్యషి౦చ ద్విభీషణమ్
మధ్యే వానర ముఖ్యానాం రాజానం రామ శాసనాత్ 6.19.26

అందుకు రాముడు సంతసించి, రావణుని శక్తిసామర్థ్యములను బాగుగా వివరించితివి. రావణుని, అతని బంధుమిత్రులను, ప్రహస్తుడుతో సహా అందరి యోధులను రణభూమికి బలి ఇచ్చి నిన్ను లంకకు రాజును చేసెదను అని చెప్పి లక్ష్మణునితో సముద్ర జలమును తెప్పించి, ఆ సముద్ర జలముతో విభీషణుని లంకకు రాజుగా అభిషేకము చేసెను.

రావణ రాజ్యమును విభీషణుడు కోరలేదు. అతడు కోరినది రామకైంకర్యమే. శత్రుపక్షము నుండి వచ్చినాడు, శంకింపదగినవాడు అని అనుకొనిన వాడు రాజుగా మారినాడు. ఇది రాముని కటాక్షము. ఇదియే శరణాగతి యొక్క విశేషము. రాముడు ఇంకను సైన్యముతో సముద్రమును దాటలేదు, యుద్ధము చేయలేదు, రావణుని చూడలేదు, చంపునో లేదో తెలియదు, ముందే విభీషణునికి పట్టాభిషేకము చేసినాడు. ఇది రాముని సర్వ శక్తిత్వమును ప్రకాశింప చేసినది.
శ్రీరామ జయరామ జయజయ రామ

యుద్ధ కాండము-9


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-9
 
విభీషణునికి శరణాగతి నిర్ణయము శ్రీరాముడు ప్రకటించుట
శ్రీరాముడు సుగ్రీవాదుల యొక్క మాటలకు ఎట్టి వికారములుకు లోను కాకుండా హనుమ వచనములకు ప్రసన్న చిత్తుడయ్యెను. ఆ మహాత్ముడు స్థిరచిత్తముతో తనలోని భావములను ఇట్లు వెల్లడించెను.
 
మిత్ర భావేన సంప్రాప్తం న త్యజేయం కథం చన
దోషో యద్య౭పి తస్య స్యాత్ సతామ్ ఏత ద౭గర్హితమ్  6.18.3

న సర్వే భ్రాతర స్తాత భవంతి భరతోపమా:
మద్విధా వా పితు: పుత్రా స్సుహృదో వా భవద్విధా:      6.18.15
 
సుదుష్టో వా౭ప్య౭దుష్టో వా కిమేష రజనీచర:
సూక్ష్మ మ౭ప్య౭హితం కర్తుం మమా౭శక్త:కథంచన           6.18.22
 
పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృధివ్యాం చైవ రాక్షసాన్
అంగుళ్య౭గ్రేణ తాన్ హన్యా మిచ్ఛన్ హరి గణేశ్వర        6.18.23

బద్ధా౭౦జలి పుటం దీనం యాచంతం శరణా౭౭గతం         
న హన్యా దా౭౭నృశంసా౭ర్థ మ౭పి శత్రుం పరంతప        6.18.27
 
ఆర్తో వా యది వా దృప్త: పరేషాం శరణాగత:
అపి ప్రాణాన్ ప్పరిత్యజ్య రక్షితవ్య: కృతాత్మనా          6.18.28
 
న చే ద్భయా ద్వా మోహా ద్వా  కామా ద్వా౭పి న రక్షతి
స్వయా శక్త్యా యథా సత్త్వం త త్పాపం లోక గర్హితం        6.18.29
 
వినష్ట: పశ్యత స్తస్యా రక్షిణ శ్శరణా౭౭గత:
ఆదాయ సుకృతం తస్య సర్వం గచ్ఛే ద౭రక్షిత:            6.18.30
 
సకృదేవ ప్రపన్నాయ తవా౭స్మీతి చ యాచతే
అభయం సర్వ భూతేభ్యో దదా మ్యేత ద్వ్రతం మమ       6.18.33
 
మిత్ర భావముతో (శరణుగోరి) నా కడకు వచ్చిన వానిని ఏదిఏమైనను త్యజింపను (నిరాకరింపను). ఒకవేళ అతనిలో దోషమేమి యున్నను దానిని పట్టించుకొనరాదు. సత్పురుషులు దోషులకు ఆశ్రయమిచ్చుట తప్పు కాదు. ఇక్కడ హనుమ విభీషణునిలో దోషములు కనబడుట లేదు కావున స్వీకరించ వచ్చు అన్నాడు కాని శరణాగతుడు గనుక స్వీకరింపవలెను అని రాముని భావము. శరణాగతిలో దోషములు ఎంచరాదు. అంతియే గాకుండా అతను శరణాగతుడు అనకుండా మిత్రుడు అన్నాడు. వానిని వదలను అని అనకుండా వదలలేను, వదలుటకు నాకు శక్తి చాలదు అన్నాడు. రాముని శరణాగత రక్షణ న త్యజేయం కథం చన ఏమైనను వదలలేను అనుటలో తెలియు చున్నది.  నిర్మల హృదయులైన జ్ఞాతులు తమ బంధువులను హితైషులుగానే భావింతురు. కాని సహజముగా జ్ఞాతి అయిన విభీషణుని రావణుడు శంకించినాడు. యీతడు మనలను వదలడు. మనము అతని కులము వారము కాము. వారి రాజ్యముపై మనకు ఆశ లేదు. యీతడు మన సహాయముతో రావణుని రాజ్యమును పొందవలెనని కోరి యుండవచ్చు. రక్షణకై మన వద్దకు వచ్చినాడు. కనుక ఈతనిని స్వీకరింప వచ్చును. ప్రపంచములో భరతుని వంటి పుత్రులు యుండరు. తండ్రికి నా వంటి పుత్రులుండరు. సుగ్రీవుని వంటి మిత్రులు ఉండరు. (రామాయణములో మనకు ముగ్గురు సోదరులు కనబడును. ఒకటి రామలక్ష్మణభరతశత్రుఘ్నులు - పరస్పరానురాగముతో అన్యోన్యముతో ప్రపంచమునకు ఆదర్శులైనారు, వాలిసుగ్రీవులు - వాలి తమ్ముడి వచనములపై అపనమ్మకంతో అతని దోషము ఏమియులేకున్నను,  కుశ్చిత బుద్ధితో రాజ్యమును అపహరించినాడు అనే అనాలోచనతో రాజ్య బహిష్కరణయే గాకుండా,చంపవలెనని కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినాడు.  రావణకుంభకర్ణవిభీషణులు పరస్పర విరుద్ధ భావములు గలవారు. రావణుని అహంకారము, కామము వలన సర్వ రాక్షస జాతి నాశనమునకు కారణమైనాడు. సోదరుల అభిప్రాయమునకు రావణుడు విలువ నీయలేదు. ఇంకను సుగ్రీవుని మాటలలోని మర్మమును ఎరిగిన రాముడు శరణాగతుడైన విభీషణుని తప్పక రక్షించవలెనని నిశ్చయించుకొని మేలైన వచనములు చెపుతూ  ... సుగ్రీవా! ఈ రాక్షసుడు దుష్టుడైనను, దుష్టుడు గాకున్నను, ఏవిధముగా నైనను, ఏకొంచెముగా నైనను నాకు కీడు చేయగలడా? వానరేంద్రా! నేను తలచుకొన్నచో ఈ లోకమున గల పిశాచములు, దానవులను, యక్షులను, రాక్షసులను కొన గోటితోనే మట్టుపెట్టెదను.  అయినచో నీవెందుకు లంకలో యున్న ఒక రాక్షసుని చంపక ఊరకుంటివి అందువేమో! ఇచ్ఛన్ సంకల్పించినచో చంపగలను. కానీ వారిని ధర్మ మార్గమున నడచునట్లు చేయుటయే నా ప్రయత్నము. శత్రువైనను అంజలి ఘటించి, దీనుడై శరణు జొచ్చి, అనుగ్రహింపుమని ప్రార్థించినచో అతనికి హాని చేయరాదు. శత్రువు ఆర్తుడైనను, గర్వించినవాడైనను, తన ప్రతిపక్షం వారిని శరణు జొచ్చినప్పుడు వారు నిశ్చయ బుద్ధితో తమ ప్రాణములను ఒడ్డియైనను అతనిని కాపాడవలెను. భయపడిగాని, ఆపద్ధర్మమును ఎరుగక గాని, స్వార్ధబుద్ధితో గాని, శక్తిగలవాడై యుండియు ఏదేని నెపముతో ఆ శరణు జొచ్చిన వాడిని రక్షింపనిచో అతడు ఈ లోకమున నిందలపాలగుటయే గాక మీదు మిక్కిలి నరక బాధలను గూడ పొందును. శరణు జొచ్చిన వానిని రక్షింపకుండా యుండినచో ఆ శరణాగతుడు నష్టపోవుటయే గాక ఇతని సమస్త సుకృతములను తీసుకొనిపోవును. అనగా శరణాగతుని రక్షింపని వారియొక్క సుకృతములన్ని నశించును. శరణాగతులను రక్షింపకుండుట మహాదోషము.  "నేను నీవాడను" అని పలుకుచు ఎవ్వరైనను ప్రపత్తితో నన్ను శరణుగోరినచో వారికి (సకల ప్రాణులకు) అభయమిత్తును (వారిని రక్షింతును) ఇది నా వ్రతము.  అందుకు సంతృప్తి చెందిన సుగ్రీవుడు, రాముని ఆనతిపై విభీషణుని సమాగమునకు త్వరపడెను.
 
శ్రీరామ జయరామ జయజయ రామ
 

Friday, 24 January 2020

యుద్ధ కాండము-8*



*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-8*

*శరణుగోరినవానికి ఆశ్రయము ఇచ్చుటయే యుక్తమని హనుమ పలుకుట*
సకల శాస్త్రములను అభ్యసించుట వలన చక్కని సంస్కారము అబ్బినవాడైన హనుమ అర్థవంతములైన మధుర వచనములను సంక్షిప్తముగా ఇట్లు పలికెను.

*న భవన్తం మతి శ్రేష్ఠం సమర్థం వదతాం వరమ్*
*అతిశాయయితుం శక్తో బృహస్పతి ర౭పి బ్రువన్*         
*న వాదా న్నా౭పి సంఘర్షా న్నా౭ధిక్యా న్న చ కామతః*
*వక్ష్యామి వచనం రాజన్ యథా౭ర్థం రామ గౌరవాత్*       
*అర్థా౭నర్థ నిమిత్తం హి య దుక్తం సచివై స్తవ*
*తత్ర దోషం ప్రపశ్యామి క్రియా న హ్యుపపద్యతే*
*ఋతే నియోగా త్సామర్థ్యమ్ అవబోద్ధుం న శక్యతే*
*సహసా వినియోగో హి దోషవాన్ ప్రతిభాతి మే*
*చార ప్రణిహితం యుక్తం య దుక్తం సచివై స్తవ*
*అర్థ స్యా౭సంభవా త్తత్ర కారణం నోపపద్యతే*   
*అదేశ కాల సంప్రాప్త ఇత్య౭యం య ద్విభీషణః*
*వివక్షా చా౭త్ర మేఽస్తీయం తాం నిబోధ యథా మతి*
*స ఏష దేశః కాల శ్చ భవ తీహ యథా తథా*   
*పురుషాత్ పురుషం ప్రాప్య తథా దోష గుణావ౭పి*
*దౌరాత్మ్యం రావణే దృష్ట్వా విక్రమం చ తథా త్వయి*
*యుక్త మా౭౭గమనం తస్య సదృశం తస్య బుద్ధితః*
*అజ్ఞాత రూపైః పురుషైః స రాజన్ పృచ్ఛ్యతామ్ ఇతి*
*యదుక్త మ౭త్ర మే ప్రేక్షా కాచి ద౭స్తి సమీక్షితా*   
*పృచ్ఛ్యమానో విశ౦కేత సహసా బుద్ధిమాన్ వచః*
*తత్ర మిత్రం ప్రదుష్యేత మిథ్య పృష్టం సుఖా౭౭గతమ్*
*అశక్యః సహసా రాజన్ భావో వేత్తుం పరస్య వై*
*అన్తః స్వభావై ర్గీతై స్తై ర్నైపుణ్యం పశ్యతా భృశమ్*
*న త్వ౭స్య బ్రువతో జాతు లక్ష్యతే దుష్ట భావతా*
*ప్రసన్నం వదనం చా౭పి తస్మా న్మే నా౭స్తి సంశయః*       
*అశ౦కిత మతిః స్వస్థో న శఠః పరిసర్పతి*
*న చా౭స్య దుష్టా వాక్చా౭పి తస్మా న్నా౭స్తీ హ సంశయః*
*ఆకార శ్ఛాద్యమానోఽపి న శక్యో వినిగూహితుమ్*
*బలా ద్ధి వివృణో త్యేవ భావ మ౭న్తర్గతం నృణామ్*       
*దేశ కాలో పపన్నం చ కార్యం కార్య విదాం వర*
*స్వ ఫలం కురుతే క్షిప్రం ప్రయోగేణా౭భిసంహితమ్*         
*ఉద్యోగం తవ సంప్రేక్ష్య మిథ్యా వృత్తం చ రావణమ్*
*వాలిన శ్చ వధం శ్రుత్వా సుగ్రీవం చా౭భిషేచితమ్*
*రాజ్యం ప్రార్థయమాన శ్చ బుద్ధి పూర్వమ్ ఇహా౭౭గతః*   
*ఏతావ త్తు పురస్కృత్య యుజ్యతే త్వ౭స్య సంగ్రహః*
*యథా శక్తి మయోక్తం తు రాక్షసస్యా౭౭ర్జవం ప్రతి*

*త్వం ప్రమాణం తు శేషస్య శ్రుత్వా బుద్ధిమతాం వర*  (6.17. 47 to 64)
రామా! నీవు గొప్ప ప్రజ్ఞాశాలివి, సర్వ సమర్థుడవు. నేను వాక్చాతుర్యమును ప్రకటించుటకు గాని, ఇతరులతో పోటీపడి బుద్ధిమంతుడను అని స్వాభిమానమును ప్రకటించుకొనుటకు గాని, ఏ విధమైన ప్రయోజనములు ఆశించి గాని కాకుండా ప్రస్తుత కార్యము యొక్క ప్రాముఖ్యమును దృష్టిలో పెట్టుకొని యదార్థములను పలుకుచున్నాను.
ఎవరినైనను రాజ కార్యము నందు నియోగించనిదే వారి సామర్థ్యమును తెలుసుకొనే వీలు కాదు. కొత్త వారికి కార్య భారమును అప్పగించుటయు సరికాదు. కావున విభీషణుని విషయమున ఈ ధర్మ సూత్రము  వర్తించును.
గూఢచారుల ద్వారా ఈయన యొక్క గుణదోషములను నిర్ణయించుట యుక్తమని తెలిపి యున్నారు. దూర ప్రదేశములు యందున్న శత్రువుల వృత్తాంతము తెలుసుకొనుటకు గూఢచారులను నియుక్తము చేయవచ్చు కానీ సమీపాన యున్న వారి విషయములో దీనివలన ప్రయోజనము శూన్యము.
విభీషణుడు ఇచ్చటికి వచ్చుట దేశకాలానుగుణము కాదని చెప్పి యున్నారు. కానీ వాస్తవముగా ఇదియే తగిన సమయము.

రావణుని లోని మరియు నీలోని గుణదోషములను ఎరిగి యున్నాడు గనుక విభీషణుడు ఇచ్చటికి వచ్చుట సమంజసమే మరియు ఇది అతని బుద్ధి కుశలతను నిదర్శనము.
అపరిచితులైన వ్యక్తుల ద్వారా ఇతని వృత్తాంతము తెలుసుకొనే వలెననే సూచన ప్రయోజన కారము కాదు ఏలనన అపరిచితులైన వ్యక్తులు అనువుగాని విధముగా ప్రశ్నించినచో అతని మనస్సు చివుక్కుమని మనకు సహాపడుటకు విముఖుడు కావుట వలన మనము ఒక మంచి మిత్రుని కోల్పోవుదము.

అంతియే గాక క్షణ కాలములో అతని యొక్క భావములను పసిగట్టుట అశక్యము. అతని ముఖము ప్రసన్నముగా యున్నది గావున అతని మాటలలో ఎట్టి కపటము కనబడుట లేదు కావున సందేహించ వలసిన పని లేదు. ప్రయత్నపూర్వకంగా మనోభావములను దాచుకొనుటకు ప్రయత్నించినను అవి ముఖకవళికలలో బయిట పడును. అవి కనబడుట లేదు.

కార్యములను చక్కగా దేశకాలములకు అనుగుణముగా ఆచరించినచో అవి వెంటనే సత్ఫలితములు ఇచ్చును. రావణుని మిథ్యాప్రవర్తనను, మీ కార్యదక్షతను, వాలిని వధించి సుగ్రీవుని పట్టాభిషేకము చేసిన విషయము ఎరింగియే యున్నాడు కావున ఇతను తనకు రాజ్యలాభము కలుగునని ఇచ్చటికి వచ్చి యుండవచ్చు.
ఈ విధముగా విభీషణుని సరళ స్వభావమును, నిర్దోషిత్వమును హనుమ రామునికి తెలియజేసి కార్యభారమును మీకు (రామునికి) నచ్చిన విధముగా ఆచరింపుమని చెప్పెను.

శరణాగతి చేయువారికి *"స ఏష దేశః కాల శ్చ భవతి"* అని హనుమ చెప్పిన మాట పరమ ప్రమాణము. శరణాగతి పొందుటకు దేశకాలములతో నిమిత్తము లేదు. ద్రౌపది సభలో రజస్వల అయినప్పుడు, అర్జునుడు ఏమి చేయలేని స్థితిలో యుద్ధభూమిలో ఉన్నప్పుడు, గజేంద్రుడు చివరి సమయములో, రాముని బ్రహ్మాస్త్రము వెంటాడుచుండగా కాకిని శరణాగతి చేయలేదా! అందుచేత శరణు పొందుటకు ధృడమైన విశ్వాసము ముఖ్యము గాని దేశకాలములు కాదు. ఇక రాముడు తన నిర్ణయము తెలియజేయుచున్నాడు.
*శ్రీరామ జయరామ జయజయ రామ*


Wednesday, 22 January 2020

యుద్ధ కాండము-7


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-7
విభీషణ శరణాగతి
యుద్ధకాండలోని విభీషణ శరణాగతి వేద సారమగు ఉపనిషత్తు. రక్షణమునకు శరణాగతియే సాధనమని విభీషణుడు నిరూపించాడు.

విభీషణుడు ఎంత ప్రయత్నించినను రావణునకు తన హితవాక్యములు రుచించలేదు.  అప్పుడు విభీషణుడు సోదరులను, భార్యాబిడ్డలను, పరివారమును, లంకను వీడి రాముని శరణాగతాభిలాషియై ఆకాశమునకు ఎగిరి వానరులు విడిది చేసి యున్న సముద్ర తీరమునకు అనలుడు, శరభుడు, సంపాతి, ప్రఘసుడు అను నలుగురు సచివులతో కలసి వచ్చి ఆకాశములో నిలబడెను. రామరక్షణమున జాగరూకులై యున్న వానరులు అందరూ ఒక్కసారే చూచిరి. రాముని యందు ప్రేమ అందరికి సమానమే. ఆ సన్నివేశమును చూచిన సుగ్రీవునకు శంక కలిగినది. సుగ్రీవుడు మనస్సులో అతను దూత కాదని, శత్రువే అని నిశ్చయించుకొని  హనుమంతాది వానరులతో వచ్చినవాడు మనలను చంపుటకు వచ్చినాడు కావున జాగరూకతతో యుండవలసినదిగా ఆదేసించెను. అంత విభీషణుడు సుగ్రీవాది వానర యోధులను చూచి బిగ్గరగా ఇట్లు నుడివెను.
 
రావణో నామ దుర్వృత్తో రాక్షసో రాక్షసేశ్వరః
తస్యా౭హమ్ అనుజో భ్రాతా విభీషణ ఇతి శ్రుతః   6.17.10
 
తేన సీతా జనస్థానా ద్ధృతా హత్వా జటాయుషమ్
రుద్ధా చ వివశా దీనా రాక్షసీభిః సురక్షితా            6.17.11
 
తమ్ అహం హేతుభి ర్వాక్యై ర్వివిధై  శ్చ న్యదర్శయమ్
సాధు నిర్యాత్యతాం సీతా రామా యేతి పునః పునః           6.17.12
 
న చ స ప్రతిజగ్రాహ రావణః కాల చోదితః
ఉచ్యమానో హితం వాక్యం విపరీత ఇవౌషధమ్     6.17.13
 
సోఽహం పరుషిత స్తేన దాస వచ్చా౭వమానితః
త్యక్త్వా పుత్రాం శ్చ దారాం శ్చ రాఘవం శరణం గతః           6.17.14
 
సర్వ లోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే
నివేదయత మాం క్షిప్రం విభీషణమ్ ఉపస్థితమ్   6.17.15
 
"మిగుల క్రూరుడైన రాక్షస రాజైన రావణునికి నేను తమ్ముడను. విభీషణుడను. దండకారణ్యము నుండి సీతాదేవిని అపహరించి, తనకు అడ్డుగా వచ్చిన జటాయువును సంహరించెను. నిస్సహాయురాలైన ఆ సాధ్వి ప్రస్తుతము రాక్షస స్త్రీల కాపలాలో నిర్బంధములో యున్నది. నేను సీతాదేవిని సాదరముగా అప్పగించమని అనేకములైన వచనములు యుక్తియుక్తముగా హితము చెప్పితిని. వాటినన్నింటిని పెడచెవిన పెట్టి నన్ను పరుషముగా దూషించాడు. అట్టి దురుసుతనమును సహింపలేక నేను భార్యాపుత్రులను వీడి రఘువీరుని శరణు జొచ్చుటకై వచ్చితిని. సమస్త లోకములకు రక్షకుడు, పరమాత్ముడు అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు విభీషణుడు శరణు గోరి తమ సమీపమునకు వచ్చి యున్నాడు" అని వెంటనే విన్నవించుడు. అప్పడు సుగ్రీవుడు త్వరగా రాముని యొద్దకు యేగి శత్రు పక్షము వాడైన విభీషణుడు వచ్చి యున్నాడు కావున తగిన వ్యూహ రచన చేసి ఆలోచన చేయవలసినదిగా విన్నవించాడు. శ్రీరాముడు సుగ్రీవుని ప్రేమను ఎరిగిన వాడు. విభీషణుడు తన యందు ధృడమైన విశ్వాసముతో ఉన్నాడని గుర్తించాడు. ప్రేమచే సుగ్రీవాదులు కాదనుచున్నారు కనుక వారిని అంగీకరింప చేసి వారి చేతనే చెప్పించవలెనని తలఁచెను. అప్పుడు శరణాగతవత్సలుడుగా వాసిగాంచిన శ్రీరాముడు సుగ్రీవుని మాటలను విని అక్కడే చేరువలో యున్న హనుమదాది వానర ప్రముఖులతో ఇట్లు నుడివెను.
 
య దుక్తం కపి రాజేన రావణా౭వరజం ప్రతి
వాక్యం హేతుమ ద౭త్య౭ర్థం భవద్భిర౭పి త చ్ఛ్రుతమ్  6.17.30
 
సుహృదా హ్య౭ర్థ కృచ్ఛేషు యుక్తం బుద్ధిమతా సతా
సమర్థే నా౭పి సందేష్టుం శాశ్వతీం భూతి మిచ్ఛతా  6.17.31
 
"రావణుని తమ్ముడైన విభీషణుని గూర్చి, సుగ్రీవుడు సహేతుకంగా పలికిన మాటలు త్రోసిపుచ్చరానివి. కావున సందర్భమును అనుసరించి ఒక మిత్రుడు చెప్పినాడు గదా యని తక్కిన వారు మిన్నకుండరాదు. ప్రజ్ఞాశాలియు, సత్పురుషుడు, శ్రేయస్సును గోరువాడు, సమర్థుడు ఐన మిత్రుడు కార్యసంకటములు ఏర్పడినప్పుడు (సమస్యలు ఎదురైనప్పుడు) తగు సూచనలను అందించుట యెంతయేని యుక్తము. కనుక మీ ఆలోచనలను నిస్సంకోచముగా తెల్పుడు". అనెను. రాముడిట్లు అడుగగానే వానరులు తమ తమ అభిప్రాయములు తెలియ జేసినారు. అంగదుడు విభీషణుడు శరణాగతుడే గాని, శత్రుపక్షము నుండి వచ్చినాడు గావున శంకింప వలయును అని అన్నాడు. జాంబవంతుడు ఇంతకు మునుపు ఎప్పుడు రాకుండా సమయము కాని యుద్ధ సమయములో వచ్చినాడు గావున  శంకించ వలెను అని అన్నాడు. సకల శాస్త్ర కోవిదుడైన హనుమ ఈ విధముగా చెప్పు చున్నాడు. 
శ్రీరామ జయరామ జయజయ రామ

 

యుద్ధ కాండము-6


శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-6
శరణాగతి
భగవంతుని చేరడానికి ముఖ్యమైన అడ్డంకి అహంభావం. ఆ అహంకారాన్ని వీడి శరణు వేడితే ఆ భగవంతుడే దిగివచ్చి, భక్తుని వశమౌతాడు. సంపూర్ణ శరణాగతి పొందడమే ఆయన్ని చేరే సూటిమార్గం. అని చెప్పే కథే గజేంద్రమోక్షం. 
అజ్ఞానముచే ప్రత్యక్షంగా కనబడే శరీరమునకు, శరీర సౌఖ్యమునకు కావలసిన వాటినే మనస్సు కోరుకొనును. ఇట్టి కోరికలని కామము అందురు. కామములలో ఎక్కువగా మానవుడిని లొంగదీసుకొనెడివి స్త్రీకి పురుషుని విషయమున, పురుషునకు స్త్రీ విషయమున కలిగేది కామము. అయితే అట్టి కామములు శాస్త్ర విహితముగా యుండవలెను. అజ్ఞానముచే కలిగిన అహంకారము వలన శరీరమే తాను అనుకొనుట, శరీరమునకు సంబంధించినవి అన్నియు తనవి అనుకొనుచు, శరీరమునకు సంబంధించిన సుఖమును పొందవలెనని మనస్సు ఆరాట పడును. అట్టి మనస్సును వశపరచుకొనుటకు మానవుడు ప్రయత్నింప వలెను. శ్రీరామాయణము వాచ్యార్థమైన రామచరితములో ఆత్మ, పరమాత్మల కథను, మనసును జయించవలసిన విధానమును నిరూపించింది. అందుకనే శ్రీరామాయణము వేదము. మనస్సును జయించి మానవుడు పురుషార్థమును పొందుటకు, ఎవరు ఇట్టి భవసాగరమును దాటుటకు సమర్థులో యోచించి శరణాగతి పొందవలెను. భగవంతుని పొందుటకు ఎన్నియో ఉపాయములు యున్నవి. భగవంతునికి ప్రీతి కలుగునట్లు ధర్మబద్ధముగా జీవించుట, అహంకారము వీడుట మొదలగునవి. కానీ ఇవి అన్నియు ఆచరణలో కష్టము. అన్నింటికన్నా ప్రధాన ఉపాయము భక్తి, శరణాగతి. శరణాగతియే అన్నింటికన్నా ముఖ్యము. అదియే సర్వ ఉపనిషత్ సారము. శరణాగతిని పొందవలసిన వాడు రాముడే. కానీ ఒక సందేహము వచ్చును. రాముడు మానవుడు కాన ఎట్లు శరణాగతి చేయగలడు? రాముడు సత్యనిష్ఠాగరిష్ఠుడు అయినందున సర్వ సమర్థుడు అని ఇంతకు ముందు చర్చించుకొన్నాము. శరణాగతికి పూర్తి నమ్మకము, విశ్వాసము ముఖ్యము. అట్టి నమ్మకము కలిగిన రాయి, రప్ప, చెట్టు, చేమ అన్నియు శరణాగతి చేయగలవు. మూఢ భక్తితో గ్రామీణులు, ఆదివాసీలు అలాగుననే చేయుదురు.  శరీరభావము తనది కాదు అనుకున్నప్పుడు అన్నియు శరణాగతికి సమర్థములే.

( ఉదాహరణకు పూర్తి నమ్మకంతో మనము కొలుచుచున్న గురుస్వరూపులైన సాయిబాబా, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు గాని, క్రిస్టియన్స్ కొలుచుచున్న ఏసుక్రీస్తు కానీ, ముస్లిమ్స్ కొలుచుచున్న అల్లా కానీ బౌద్ధము ఆరాధించుచున్న బుద్ధుడు కానీ శరణాగతి చేయదగినవారే.  వేదమే సత్యమని వేదకాలపు మహర్షులు, పరమాత్ముడే ఎకైక సత్యమని త్రేతాయుగ, ద్వాపరయుగంలలో, ఆత్మయే సత్యము కఠోరమైన తపస్సు ద్వారా ఆత్మ సుదర్శనం అగునని మహావీరుడు, నిర్వాణము ద్వారా ఉన్నత స్థితి పొందవచ్చని గౌతమ బుద్ధుడు, ప్రార్థన వలన ఈశ్వరుడుని పొందవచ్చని జీసస్, సర్వాంతర్యామి అయిన అల్లా తప్ప వేరొక భగవంతుడు లేడని మహమ్మద్ ప్రవక్త, రామ నామమే స్థిరమైనది అని సంత్ కబీర్ దాస్, ఇంకా అనేక మంది గురువులు బోధించారు. (స్వామి అడగడానంద "యథార్థ గీత నుంచి సేకరణ). తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత!, తత్ప్ర సాధాత్పరాం శాంతిం స్థానం ప్రాప్సయసి శాశ్వతమ్ (భ.గీ.18/62) హే భారతా! సంపూర్ణ భావంతో ఈశ్వరుడుని శరణు పొందు. ధ్యానం హ్రుదయం లో చేయండి. ఇది తెలిసి కూడా గుడి, మసీదు, చర్చి లేదా ఇతరత్రా వెతకడం, సమయాన్ని హ్రుథా చేయడమే.
హిందూ మతము వేదకాలం నుంచి కొనసాగుతున్న ఒక మహావ్రుక్షము లాంటిది. ఇతర మతాలు, ధర్మాలు ఆ మహావ్రుక్షమునకు కొమ్మలు లాంటివి. అశాశ్వతమైన అట్టి కొమ్మలను చూచి వ్రుక్షమూలము అసూయ పడునా? ద్వేషించునా? ద్వేషించినచో భగవత్ సాన్నిధ్యము కలుగునా? అహంకారం, ద్వేషము,అసూయ లేనప్పుడు అందరూ భాగవుతులుగా గోచరిస్తారు.
శ్రీరామాయణములో శ్రీరామునికి ఏ వర్ణము నందు కానీ, వర్గము నందు కానీ బేధభావము లేదు. మానవులను (తక్కువ జాతియైన శబరి, గుహుడు తో సహా), పశుపక్ష్యాదులు, వానరులను, తిర్యక్కులను, రాక్షసులను ఒకే విధముగా చూచారు. నేటి సమాజములో అట్టి బేధభావము నాశనము చేసి రాముని ఆదర్శముగా తీసుకోవలసిన అవసరము ఎంతైనా యున్నది. 
ఇట్టి విభీషణుడు శరణాగతి రేపు అవలోకించుకొందాము.)
శ్రీరామ జయరామ జయజయ రామ

 

Monday, 20 January 2020

యుద్ధ కాండము-5*


*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-5*
*సీతను బలాత్కారముగా అనుభవింపుమని మహాపార్శ్వుడు రావణునికి తెలుపుట*
మహాబలుడగు మహాపార్శ్వుడు రావణునితో ఇట్లు విన్నవించెను.
తేనె త్రాగవలెనన్న ఉత్సాహముతో మృగములతో, క్రూర జంతువులతో నిండి యున్న అరణ్యమునకు వెళ్లి అవకాశము లభించినను తేనె త్రాగకుండా ఆలోచించువాడు మూర్ఖుడు. ఆలాగుననే దుష్కరమైన సీతాపహరణము తరువాత కూడా ఆలోచించుతూ ఆమెను భోగించకుండా యుండుట మూర్ఖత్వము.

*ఈశ్వర స్యేశ్వర: కో౭స్తి తవ శత్రు నిబర్హణ*
*రమస్వ సహ వైదేహ్యా శత్రూ నా౭౭క్రమ్య మూర్ధసు*  6.13.3

*బలాత్ కుక్కుట వృత్తేన వర్తస్వ సుమహాబల*
*ఆక్రమ్యా౭౭క్రమ్య సీతాం వై తథా భుంక్ష్వ రమస్వ చ* 6.13.4

శత్రుసూదనా! సర్వనియంతవు. మిమ్ములను నియమించు వాడు లేడు.  తమరు స్వయముగా ఈశ్వరులు. మీకు ఈశ్వరులు ఎవరు? శత్రువులను నష్టపరచి మీరు సీతను పొందండి. కుక్కుటము వలె సీతతో ప్రవర్తించండి. బలముచే పదే పదే ఆక్రమించి అనుభవింపుము. కోరిక తీరిన తరువాత ఏ ప్రమాదము వచ్చినను వాటినన్నింటిని మీరు సమర్థముగా ఎదుర్కొనగలరు. అంతియే గాక మహాబలశాలురైన కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు యొక్క అండదండలు గలవు. మహాపార్శ్వుడు ఇట్లు నుడివిన తరువాత లంకేశ్వరుడు సంతోషించి ఈ విధముగా వచించెను. "బ్రహ్మదేవుని అనుగ్రహమును నేను ఆకాశమార్గమున పోవుచుండగా పుంజికస్థలయను అప్సరస అగ్నిజ్వాలవలె మెరయుచు ఆకాశమార్గమున పోవుట చూచితిని. అప్పుడామె నాకు భయపడి మబ్బులచాటున దాగికొని వెళ్ళుచుండెను. అంతట నేను ఆమెను వివస్త్రను గావించి, బలవంతముగా అనుభవించితిని. పిమ్మట ఆమె బ్రహ్మ భవనమునకు వెళ్లగా,  బ్రహ్మ కుపితుడై ఇక నుంచి నేను ఎవరినైనా బలవంతముగా అనుభవించినచో నా శిరస్సు నూరు ముక్కలు అగునని శాపము ఇచ్చినాడు. ఆ శాపమునకు భయపడి నేను ఆమెను బలవంతముగా అనుభవించుటకు పూనుకొనుట లేదు. వెనుక రంభను బలాత్కరించినప్పుడు రావణునకు నలకూబరుడు కూడా ఇట్టి శాపమునే ఇచ్చెను. కానీ అతడు తక్కువ వాడని అనాదరించి రావణుడు మరల పుంజికస్థలను బలాత్కరించెను. ఇప్పుడు బ్రహ్మ శాపము ఇచ్చినాడు కావున ఇది అనుల్లంఘనీయము. సముద్రము వంటి వేగము, వాయువు వంటి గమనము గలవాడను. ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు కూడా నన్ను ఎదిరింపజాలరు. రాముడు నా సామర్ధ్యమును ఎరుగడు అని ప్రగల్బములను పలికినాడు.

రావణుడు అహంకారంతో కూడిన, వివేకము లేని సాధకుడు. పరస్త్రీ అనగా సాధకుడు తన వృత్తిని లేదా ధర్మమును విడచి పరవృత్తిని స్వీకరించుట. రావణునికి మండోదరి వృత్తి స్వధర్మము. సీతావృత్తి పరధర్మము. సీతావృత్తిని బలాత్కారముగా గ్రహించినచో, రావణ ధర్మము విఘటనము చెంది నూరు ముక్కలగునని ఆంతర్యము. *పిండే పిండే మథిర్భిన్న:* ప్రతి వ్యక్తి యొక్క పద్ధతి, బుద్ధి, ధారణ మరియు ధర్మము ప్రత్యేకముగా యుండును. తన ధర్మము ననుసరించియే సాధన చేయవలయును. పరధర్మ సేవన చేసినచో సాధకుడు నూరు భాగములై అధఃపతనము చెందును. *"వివేక భ్రష్టానాం భవతి విని పాతః శతముఖా"*

మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు మొదలగువారి ప్రగల్బ వచనములు, రావణుని శాప వచనములు విన్న తర్వాత ఇట్లు అర్థవంతమైన హిత వచనములు విభీషణుడు పలికెను. పర్వత శిఖరముల వలె మహోన్నతులు, కోరలు నఖములు ఆయుధములుగా గలవారు ఐన వానర ప్రముఖులు. శ్రీరాముని యొక్క బాణములు వజ్రాయుధము వలె తిరుగులేనివి. కావున వారు లంకా నగరంపై విరుచుకొని పడకముందే సీతాదేవిని శ్రీరామునికి అప్పగించుట ఎంతయేని సముచితము. ఇంకను బీరములు పలికిన  వీరందరూ శ్రీరాముని ఎదుర్కొనలేరు. అంతియేగాక రావణుడు వ్యసనములకు బానిస అయ్యి యున్నాడు. మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు మొదలగువారి ప్రగల్బ వచనములు, రావణుని శాప వచనములు విన్న తర్వాత ఇట్లు అర్థవంతమైన హిత వచనములు విభీషణుడు పలికెను. పర్వత శిఖరముల వలె మహోన్నతులు, కోరలు నఖములు ఆయుధములుగా గలవారు ఐన వానర ప్రముఖులు. శ్రీరాముని యొక్క బాణములు వజ్రాయుధము వలె తిరుగులేనివి. కావున వారు లంకా నగరంపై విరుచుకొని పడకముందే సీతాదేవిని శ్రీరామునికి అప్పగించుట ఎంతయేని సముచితము. ఇంకను బీరములు పలికిన  వీరందరూ శ్రీరాముని ఎదుర్కొనలేరు. అంతియేగాక రావణుడు వ్యసనములకు బానిస అయ్యి యున్నాడు. అందుకు ఇంద్రజిత్తు, విభీషణుని తీవ్ర పదజాలములతో దూషించెను. ఇంద్రజిత్తు మాటలను విని విభీషణుడు ఇంద్రజిత్తునితో నీవు బాలుడవు, నీకు బుద్ధి బలము చాలదు. నీవు ఇట్లు అర్థరహితముగా పలుకుట వలన ఆత్మవినాశనము తప్పదు. శ్రీరాముని బాణములు బ్రహ్మదండము (బ్రహ్మదండమనగా ప్రళయకాలము నందు అగ్నిజ్వాలలతో ప్రభవించెడి తోక చుక్క, విశ్వామిత్రుని అస్త్ర, శస్త్రములను నిలువరించిన వసిష్ఠుని చేతిలోని బ్రహ్మాండము) వలె నిప్పులు గ్రక్కునవి, తేజోవంతమైనవి, మృత్యుదేవతకు ప్రతిరూపములైనవి. యమపాశములవలె ప్రాణాంతకమైనవి. అట్టి రాముని శరములకు రణరంగమున ఎవ్వరు తట్టుకొనలేరు.   అప్పుడు రావణుడు మిక్కిలి కోపముతో సకల లోకముల యందలి దాయాదుల స్వభావములను నేను ఎరుగుదును అని దురుసుగా పలికెను. శత్రువులతో కలసి హాయిగా జీవించవచ్చు. పగబట్టిన పాముతో కలసి హాయిగా ఉండవచ్చు. శత్రుపక్షపాతి అయిన సోదరుడని పేరుతో శత్రుత్వమును సాగించెడి సహజ శత్రువుతో జీవించుట దుశ్శకము. జ్ఞాతులు సహజ శత్రువులు. శత్రువు కంటే, సర్పము కంటే ప్రమాదకరమైనవారు. కనుక సహజ శత్రువులను దూరముగా యుంచవలెను. నీవు గూడ జ్ఞాతివి అగుటచే ఇప్పుడు నాకు ఆపద కలుగుటచే నన్ను దెబ్బ తీయుటకు ప్రయత్నించు చున్నావు. ఏనుగుకు ఏనుగే శత్రువైనట్లు జ్ఞాతుల వలననే ప్రమాదము. తామరాకుపై నీటిబొట్లు ఎంతసేపు యున్నను దానిని అంటుకొననట్లే నీవు నాతో ఎంతసేపు స్నేహము నటించినను, నీకు నాపై మనసులో స్నేహము కలుగదు. అప్పుడు విభీషణుడు, రాజా! మనసునకు నచ్చినట్లు మాటలాడెడి వారు అనేకులుగా యుందురు కానీ మేలు కలిగించెడి వారు ఎక్కడోగాని లభింపడు. నీవు ఇప్పుడు కాలిపోవుచున్న ఇంటిలో యున్నట్లు మృత్యుముఖంలో యున్నావు. రామబాణ ప్రవాహముతో కొట్టుకొని పోవక తప్పదు. అని చెప్పి విభీషణుడు వెళ్లెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

--(())-- 

Sunday, 19 January 2020

యుద్ధ కాండము-4*


*శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-4*
*కుంభకర్ణుని ధర్మ వచనములు*

విభీషణుని ఉపదేశముచే వ్యాకులుడైన రావణుడు, మరునాడు ముఖ్యులైన మంత్రులతో, మహావీరులతో, మిత్రులతో లోతుగా ఆలోచించ దలచి వారినందరిని తన ఆలోచనామందిరమునకు పిలిచెను. విచ్చేసిన వారందరితో ఇట్లు పలికెను. "ధర్మము, అర్థము, కామము సాధించుచున్నప్పుడు కొన్ని విషమ పరిస్థితులు సంభవించును. ఏది సేవింప వలెనో, ఏది సేవింపరాదో నిర్ణయించుకొనుట కష్టము. మీరందరు సమర్థులు, లాభము;నష్టము, హితము;అహితము, ప్రియము;అప్రియము అనువాటిని వివేకించి ఎరుగ గలవారు కావున మనము ఏమి చేయవలెనో నిర్ణయించుడి" అని అడిగెను. రాముని భార్యను లంకకు తీసుకొని రాబడినది. కుంభకర్ణుడు ఇప్పుడే నిద్ర నుండి లేచివచ్చినాడు కావున అతనికి కూడా తెలియ చెప్పుటకు మరల చెప్పుచున్నాను. ఆమె నాతో కూడి భోగములు అనుభవించుటకు ఇష్టపడుట లేదు. ఆమెను చూచి కామపరవశుడనైతిని. ఆ కామముచే క్రోధము, హర్షము కలుగు చుండును. శోకము, సంతాపము విడువక బాధించుటచే మనసు చెదిరిన వాడనై యున్నాను. ఆమె నన్ను ఒక సంవత్సరము గడువు ఇమ్మని కోరినది[1]. అందుకు అట్లే అని ప్రతిజ్ఞ చేసితిని. దుర్లభమైన సముద్రమును దాటి ఒక కోతి మహత్తరమైన యుద్ధము చేసినది. ఒక మనుష్యుని వలన నాకు భయము లేదు. కానీ కార్యములు ఎట్లుండునో, ఏమి జరుగునో తెలియ రాకున్నది. రామలక్ష్మణులు సుగ్రీవుడు మొదలగు వానర సేనలతో సముద్రము ఆవల యున్నారు. సీతమ్మను వారికి ఒసగ రాదు. రామలక్ష్మణులను ఇరువురిని సంహరింపవలెను. అందుకు ఏమి చేయవలెనో బాగుగా ఆలోచించుడి" అని రావణుడు పలికెను.

కామాతురుడైన రావణుని మాటలను విని కుంభకర్ణుడు మిక్కిలి క్రుద్ధుడై ఇట్లు పలికెను.

*యదా తు రామస్య సలక్ష్మణస్య*
*ప్రసహ్య సీతా ఖలు సా ఇహా౭౭హృతా*

*సకృత్ సమీక్ష్యైవ సునిశ్చితం తదా*
*భజేత చిత్తం యము నేవ యామునం* 6.12.28

*సర్వ మేత న్మహా రాజ కృత మ౭ప్రతిమం తవ*
*విధీయేత సహా౭స్మాభి: ఆదావే వా౭స్య కర్మణ:*   6.12.29

ప్రభూ! (అన్నా!) రామలక్ష్మణులను వంచించి, వారి ఆశ్రమము నుండి సీతాదేవిని అపహరించి తీసుకొని రాకముందే మాతో ఒకసారి సంప్రదించి నిర్ణయించుకొనిన బాగుండెడిది. నీవు సీతాహరణాది కృత్యములను ముందు వెనుక ఆలోచించక చేసితివి. ఇప్పుడు దానిని గూర్చి చర్చించుట గతజలసేతు బంధనము వంటిదే కదా! (నీరంతయు ప్రవహించి పోయిన పిమ్మట దానికి అడ్డుకట్ట వేయుట వృధా కదా) నిశ్చయాత్మక బుద్ధిగల ప్రభువు రాజకార్యమును బాగుగా ఆలోచించి నిర్వహించినట్లయితే తర్వాత పశ్చాత్తాపము పడవలసిన పని యుండదు. యుక్తాయుక్తములు ఎరుగని వాడే ముందుగా చేయవలసిన కార్యములను తర్వాత, తరువాత చేయవలసిన పనులు ముందుగా చేయుదురు. నేనే బలవంతుడిని అని విర్రవీగుచు తొందరపాటుతో వ్యవహరించెడి చపలచిత్తుని లోపములను శత్రుపక్షము వారు గమనించి వానిని దెబ్బతీయుదురు. ఇప్పటివరకు శ్రీరాముడు నిన్ను చంపకుండుట నీ అదృష్టముగా భావింపుము. అయినను మహారాజా! నీవు దుఃఖితుడవు కాకుము. నేను వారిని అందరిని సంహరించి నీకు మోదము కలుగ జేతును. నా చేతిలో రాముడు మృత్యుముఖమున చేరిన పిమ్మట సీత నీకు శాశ్వతముగా వశమగును  అని రావణునికి స్వంతన వాక్యములు పలికెను.
రావణుని సోదరుడైన కుంభకర్ణుడు గొప్ప సమర్దశీలుడు, పరాక్రమము, వివేకము కలవాడు. తీవ్ర తపస్సుచే బ్రహ్మను ప్రత్యక్షము చేసుకొనినాడు. బ్రహ్మను ఈ ప్రపంచ వ్యవహారములకు దూరముగా యుండవలెనని కోరుటకు బదులుగా అన్ని వేళలా నిద్రను ప్రసాదించమని కోరినాడు. (కుంభకర్ణుని వ్రుత్తాంతము ఉత్తర కాండము లో వివరించబడింది. ఈ కాండము లో శ్రీరామునికి, విభీషణుడు ద్వారా కుంభకర్ణుని వ్రుత్తాంతము చెప్పబడింది) భోగాలు - భోగసాధనాలు మరియు బలానికి నిలయమైన భగవంతుని జాగృతి పరచకుంటే మనమేమి పొందగలం? లోకమెప్పుడు నిద్రిస్తూ వుంటుంది. నిద్రించేవాడు ఎవరినైనా ఎప్పుడైనా జాగృతపరచగలడా? జ్యోతి స్వరూపుడైన పరమాత్మ జాగరూకుడుని మాత్రమే మేల్కొల్పగలడు. *'జాగృవాంసః సమింధతే'* అని మంత్రం. దీనినే ఋగ్వేదం మరియు కఠోపనిషత్తు. *'దివేదివ ఈడ్యో జాగృవద్భిః'* అని ప్రబోధించాయి. భగవద్గీత కూడా- *యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః*  ''ప్రాణులన్ని నిద్రించే సమయంలో యోగులు మేల్కొని యుంటారు. యోగులు నిద్రించే సమయంలో ప్రాణులు నిద్రిస్తాయి'' అని ఇదే విషయాన్ని సమర్థించింది. సామాన్య జనులు భోగానుభవం నుండి బయటపడలేరు. వారి జీవితమంతా ఆహార పానీయాది సామగ్రిని సమకూర్చుటయందే గడిచిపోతుంది. కాని ఎవరీ శరీరాన్ని ఇచ్చాడో అతడే దీనిని రక్షణ చేసే సామగ్రిని కూడా తప్పక ఇస్తాడని జ్ఞానికి మాత్రమే తెలిసియుంటుంది. అతనిని ఈ జన్మలోనే తప్ప మరో జన్మలో పొందడం మాత్రమే సాధ్యపడదు.

కుంభకర్ణుడు జ్ఞాని. అందుచే వాల్మీకి వాని నామమును "కుంభకర్ణుడు" (కుంభము వలె కర్ణములు కలవాడు) అని పేరిడెను. శ్రవణము ద్వారానే జ్ఞానమును గ్రహించెడి వాడు. మంచి ఆలోచనలు యున్నప్పటికీ కుంభకర్ణ సాధకుడు ఇతరుల ప్రోద్బలంతో తన సత్కర్మను విడిచి చెడు కర్మను ఆచరించెడి వాడు. భవసాగరమును దాటగల సమర్థుడు. చెడ్డ ఆలోచనలు విను స్వభావము గలవాడు గనుక రావణునికి సహకరించెదనని మాట ఇచ్చెను.
*శ్రీరామ జయరామ జయజయ రామ*

[1] ఇచ్చట రావణుడు సభాసదుల ఎదుట తన ఔదార్యమును ప్రకటించుకొనుచు బొంకుచున్నాడు.
*శృణుమైథిలి! మధ్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని! కాలేనా౭నేన నా౭భ్యేషి యది మాం చారుహాసిని! తతస్త్వామ్ ప్రాతరాశార్థం సూదా: చేత్స్యంతి లేశశః*  (అరణ్య కాండ సర్గ 56 శ్లోకములు 24 - 25 )
ఓ! మైథిలి నా మాట వినుము. నీకు పండ్రెండు మాసములు గడువును ఇచ్చుచున్నాను. ఈ లోపల నా యెడల సుముఖురాలివి గాకున్నచో గడువు తీరిన మరునాడే ప్రాతఃకాల భోజనమునకై వంటవారు నిన్ను ముక్కలు ముక్కలుగా చేయుదురు.


Saturday, 18 January 2020

యుద్ధ కాండము-3 om sriraam ***



[5:55 AM, 1/19/2020] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-3
 
రావణుడు యుద్ధమునకై మంత్రాలోచన
హనుమ లంకానగరమున ఒనర్చిన ఘోరకృత్యములకు రావణుడు ఎంతయో ఖిన్నుడయ్యెను. పిమ్మట సిగ్గుతో తలవంచుకొనినవాడై రాక్షసులతో ... "ఎవరును ప్రవేశింప వీలుకాని లంకానగరములో ఒక వానరుడు జానకిని దర్శించి అనేక విధములుగా లంకానగరమును అల్లకల్లోలం చేసెను. కావున ఇప్పుడు మీ క్షేమముకై చేయవలసిన కర్తవ్యమును తెలుపుడి. ఇక్కడ రావణుడు తన అపరాధమును కప్పి పుచ్చుకొనుచు తాను ప్రజల కోసమే అని అంటున్నాడు. శ్రీరాముడు మన లంకానగరముపై దాడి చేయుటకు వేలకొలది వానరులతో రాబొవుతున్నాడు. అతను తన బలముతో గూడి యుక్తియుక్తముగా సాహసము చేసి, తన పరాక్రమముతో సేతువును నిర్మించిగాని, జలములను ఇంకించి గాని సముద్రమును దాటగలడు. కావున తగిన సూచనలు చేయుడు". అనెను. అప్పుడు రాక్షసులు తమ తమ వైభవములను, పరాక్రమములను ప్రస్తుతించుకొని, రావణుని పరాక్రమమును గుర్తు చేసి, ఇంద్రజిత్తు యొక్క పరాక్రమమును గుర్తు చేసి రాముడు నీకు సరిసాటి కాదని చెపుతూ ఇంద్రజిత్తు ఒక్కడే ససైన్యముగా శ్రీరాముని హతమార్చగలడని రావణునికి విన్నవించిరి. ప్రహస్తుడు మున్నగు వారు ఎవరికీ వారే తానొక్కడినే రాముని జయించగలమని ప్రగల్బములు పలికిరి. విభీషణుని ఉపదేశము

రాక్షసుల యొక్క సమరోత్సాహమును చూచి విభీషణుడు వినమ్రముతో ఇట్లు పలికెను.
"రాజనీతిని అనుసరించి ముందుగా సామ, దాన, భేదోపాయములను ప్రయోగించవలెను. ఈ మూడిటితో శత్రువిజయము లభించనప్పుడు చివరిదైన దండోపాయమును చేపట్టవలెను. శత్రువులు ఇంద్రియ సుఖములకు లోనై జాగరూకులు కానివారి పైనను, విరక్తులై రాజ్యపాలన పైన శ్రద్ధ చూపనప్పుడు, సామంత రాజులు వలన చిక్కులు పాలైనప్పుడు, దైవ వశముచే సంపదలు కోల్పోయిన వారిమీదను, రాజ్య పాలన బాలుర మరియు వృద్ధుల చేతిలో యున్నప్పుడు మంత్రులతో సంప్రదించి యుద్ధము చేసి విజయము సాధించవచ్చును. (ఇరువది రకముల శత్రువులతో సంధి చేసుకొనుటకు అంగీకరింప కూడదని కామందక నీతిశాస్త్రము చెప్పుచున్నది అవి వరుసగా .. బాలుడు, వృద్ధుడు, దీర్ఘరోగి, జ్ఞాతులచే వెలివేయబడినవాడు, పిరికివాడు, పిరికి పరిజనము గలవాడు, లోభము కలవాడు, లోభముగల పరిజనము గలవాడు, ప్రజల యొక్క అనురాగము కోల్పోయినవాడు, విషయభోగములపై ఆసక్తి గలవాడు, మంత్రిమండలిలో భిన్నాభిప్రాయము ఉన్నప్పుడు, దేవతలను, బ్రాహ్మణులను నిందించువాడు, దైవము ప్రతికూలంగా యున్నప్పుడు, అంతయు దైవమే చేయునని పౌరుషమును వదలినవాడు, కరువు, అపపదలు ముంచెత్తినవాడు, సైన్యములో కలతలు ఉన్నవాడు, తన దేశములో తాను లేనివాడు, పెక్కుమంది శత్రువులు ఒక్కమారు చుట్టినవాడు, మరణము ఆసన్నమైనవాడు, సత్యధర్మములను వీడినవాడు) కానీ శ్రీరాముడు కామక్రోధములను జయించి అజేయుడై, యుద్ధమునకు సన్నద్ధుడై యున్నాడు. దుస్సాధ్యమైన సముద్రమును లంఘించి హనుమ లంకకు చేరెను కావున ఈ విషయము కూడా ఆలోచించవలసినది”. 

కిం చ రాక్షస రాజస్య రామేణా౭పకృతం పురా
ఆజహార జనస్థానా ద్యస్య భార్యాం యశస్వినః     6.9.13

ఖరో యద్య౭తివృత్త స్తు రామేణ నిహతో రణే
అవశ్యం ప్రాణినాం ప్రాణా రక్షితవ్యా యథా బలమ్ 6.9.14
 
అ యశస్య మ౭నాయుష్యం పర దారా౭భిమర్శనం
అర్థ క్షయ కరం ఘోరం పాపస్య చ పునర్భవం     6.9.15
 
త న్నిమిత్తం వైదేహీ భయం నః సుమహ ద్భవేత్
ఆహృతా సా పరిత్యాజ్యా కలహా౭ర్థే కృతే న కిమ్ 6.9.16
 
ఇంతకు రాముడు, రావణునికి చేసిన అపరాధము ఏది? మనప్రభువే జగత్ప్రసిద్ధుడైన రాముని భార్యను అపహరించెను. ఖరుడు రాముని వధించుటకు సిద్ధపడినప్పుడు, రాముడు ప్రాణాపాయస్థితి కలిగినది కావున తనను తాను రక్షించుట కొరకై రాముడు ఖరుని సంహరించెను. పరస్త్రీని తాకుట వలన కీర్తిప్రతిష్టలు దెబ్బతినును. ఆయువు క్షీణించును, సమస్త సంపదలు హరించును, అట్టి పాపాత్మునకు నీచ జన్మ ప్రాప్తించును. కావున అపహరించిన సీతాదేవిని వారికి అప్పగించుట సముచితము.  రావణుడు విభీషణుని పలుకులు విని తన భవనములోనికి వెళ్లెను. పిమ్మట విభీషణుడు రావణ భవనమునకు ఏగి మృదువుగా ఇట్లు విన్నవించాడు. "అన్నా! సీతమ్మను తెచ్చిన దగ్గరనుంచి అనేకమైన అశుభ సూచనలు గోచరించుచున్నవి. కావున నీకు సమ్మతి యైనచో శ్రీరామునికి సీతను అప్పగించుము. అదియే  మన తప్పిదములకు ప్రాయశ్చిత్తము" అందుకు రావణుడు క్రోధావేశుడై మైథిలిని అప్పగించుటకు ఇష్టపడక సోదరుడిని అచట నుండి పంపివైచెను.
శ్రీరామ జయరామ జయజయ రామ
ప్రాంజలి ప్రభ ---  మల్లాప్రగడ రామకృష్ణ 

మల్ల 

Friday, 17 January 2020

యుద్ధ కాండము-2 om sri raam ***


[6:04 AM, 1/18/2020] యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-2
వానర సేనల యుద్ధ యాత్ర
 
శ్రీరాముడు నీతి శాస్త్రమును అనుసరించి తాము దండెత్తవలసిన రాజ్యము యొక్క దుర్గములను, రక్షణ విధానమును తెలుసుకోనుయుటకై అందుకై చూచి వచ్చిన హనుమతో భౌతిక సాధనముతో సముద్రమును దాటుటకు ప్రయత్నము చేసేదెము. అలాకానిచో వేగముగా సముద్రమును దాటునట్లు చేయగలను. కావున అంతకు ముందు లంక యొక్క రక్షణ వ్యవస్థను సవివరముగా ఉన్నది ఉన్నట్లుగా చూచినావు గనుక చెప్పవలసినదిగా అడుగుతాడు. అప్పుడు హనుమ రామునితో "రామా! రాక్షసులు రావణుని యెడల మిక్కిలి భక్తి విశ్వాసములు గలవారు, పరాక్రమ మంతులు, లంక యొక్క సమృద్ధి అనవధికము, సమగ్రము, భయంకరం. వాని సేన చక్కని విభాగములతో అమర్చబడినది. ఆ బలముల సంఖ్య అత్యధికం. లంకలో జనులు హర్షముతో, ఆనందముతో, నిర్భయులై యున్నారు. వారికి ఏ విధమైన మానసిక తాపములు లేవు. రథ, గజ, తురగములతో సైన్యము అత్యధికముగా యున్నది. దుర్భేద్యమైన ద్వారములు, ప్రాకారములు, అగడ్తలు, ద్వారముల వద్ద బాణములను, శిలలను చిమ్ము యంత్రములు, శతఘ్నులతో రక్షణ వ్యవస్థ బలముగా యున్నది గావున ప్రవేశించుటకు శక్యము కానిది. పట్టణ ప్రాకారము సువర్ణ మయము, మణులు, వైడూర్యములు, పగడములు ముత్యములు ప్రాకారమును అమర్చ బడినవి. నాలుగు ద్వారముల వద్ద సంక్రమములు యున్నను ఉత్తర ద్వారము వద్ద యున్న సంక్రమము మహా ధృడమైనది. రావణుడు ఎల్లవేళలా యుద్ధమునకు సంసిద్ధుడై యుండును. ద్యూతాది వ్యసనములకు లోనుకాకుండా అప్రమత్తముతో ఎల్లప్పుడూ సైన్యమును పర్యవేక్షించు చుండును. లంక త్రికూట పర్వతమున యున్నది. అందువలన అక్కడకు చేరుకొనుట చాలా కష్టసాధ్యము. ఆ పట్టణమునకు నాడి దుర్గము, పర్వత దుర్గము, వన దుర్గము, కృత్రిమ దుర్గము అను నాలుగు దుర్గములు కలవు. అవికాక శిల్పులచే నిర్మింపబడిన ప్రాకార పరిఘాధులు యున్నవి. సముద్రమునకు దూరముగా యుండుటచే అక్కడికి నౌకామార్గము లేదు. తూర్పు ద్వారము వద్ద అయుత సంఖ్యలో అనగా పదివేల మంది రాక్షసులు, దక్షిణ ద్వారము వద్ద నియత సంఖ్య గల సైన్యము అనగా ఏబది వేలమంది, పశ్చిమ ద్వారమున లక్ష రాక్షస సైన్యము, ఉత్తర ద్వారము వద్ద కోటి మంది సైన్యము,  ఇక మధ్య భాగమున ఎవరును ఎదిరింప శక్యము కాని నూరువేల రాక్షసులు కోటి సంఖ్య గల సైన్యము  రథ, గజ, తురగ, పదాతి దళములతో సర్వాయుధ ధారులై యుద్ధమునకు సన్నద్ధముగా యుందురు.  నేను నా శక్తి కొలది చాలా మందిని అంతమొందించి రక్షణ వ్యవస్థను ఛిద్రము చేసితిని. మనము ఏదోవిధముగా సముద్రమును దాట వలెను. దాటితిమా మన వానరులు లంకను అంతమొందించుట నిశ్చయము. అంగదుడు, ద్వివిదుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, నలుడు, నీలుడు ఎగిరి లంకకు చేరుకోగలరు. మిగిలిన వారు చేరలేకపోయినను లంకా నగరమును నాశనము చేయగలరు. రామా! నీ ఆజ్ఞ కొరకు వానర సైన్యము సర్వ సన్నద్ధముగా యున్నది" అని చెప్పెను. అప్పడు రాముడు, ఇది ఎంత పని. ఇప్పుడు సూర్యుడు ఆకాశ మధ్యమము యున్నాడు. ఇది "విజయము" అను ముహూర్తము, చాలా శ్రేష్టమైనది, ఈనాడు ఉత్తర ఫల్గుణి నక్షత్రము. ఫాల్గుణ పూర్ణిమ. నాకు సాధన తార. మంచి శుభ శకునములు కనబడుతున్నవి కావున సుగ్రీవునితో ప్రయాణమునకు సన్నద్ధము కావలెనని నిర్ణయించాడు. అందుకు లక్ష్మణ సుగ్రీవునితో సహా  అందరూ వానరులు హర్షించారు.

రాముడప్పుడు ఇట్లు చెప్పు చున్నాడు. నీలుడు సేనానాయకుడు, సైన్యమునకు మార్గదర్శనం చేయవలెను. అతనితో నూరువేల మంది సైన్యము ఉండవలెను. మార్గమున జలము, ఫలములు తో కూడి యుండవలెను. రాక్షసుల యెడల అప్రమత్తతో యుండవలెను. కిష్కింధలో దుర్బలమైన సైన్యమును ఉంచి పరాక్రమము గలవారు ప్రయాణము కావలెను. గజుడు, గవయుడు, గవాక్షుడు సైన్యము ముందు నడువ వలెను. ఋషభుడు సైన్యమునకు దక్షిణ భాగమున, దుర్ధర్షుడు, గంధమానుడు ఎడమ వైపు, నేను (శ్రీరాముడు) హనుమంతునిపైన, లక్ష్మణుడు అంగదుని పైన అందరికి కన్పించుతూ సైన్యమునకు హర్షమును కల్గించుదుము. జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి సైన్య మధ్య భాగమున ఉందురు. రాముడు ఇట్లు ఆజ్ఞాపించగా అందరూ హర్షాతిరేకములు చేసిరి. రాముని ఆజ్ఞానుసారము అందరూ పల్లెలకు, పట్టణములకు ఉపద్రవములు కల్గించకుండా దక్షిణ దిక్కుకు ప్రయాణము సాగించిరి.శుక్రుడు మేష రాశి యందు యున్నాడు. జన్మరాశి రామునకు కర్కాటకము, మేషరాశి నందు శుక్రుడు దశమ స్థానమున యుండుట వలన శుభప్రదము బృహస్పతి మొదలగు గ్రహములు ఆయా రాశులలో అనుకూలముగా యున్నవి. రామునకు యుద్ధయాత్రకు బయిలుదేరునాటికి ముప్పది ఆరు సంవత్సరముల వయస్సు. అందుచే గురువు సింహ రాశిలోను, శని మకర రాశిలోను, శని కేతువులు జన్మరాశికి షష్టమ స్థానములోను, పంచమమగు వృచ్చికమున కుజుడు, చంద్రుడు నవమములోను, సూర్యుడు అనుకూలురు.  రాహువు మిధున రాశిలో యుండుటచే కొద్దిగా బాధను కల్గించినను మొత్తము మీద రామునకంతయు గ్రహ బలము బాగుగా యున్నది. రాక్షసులకు ప్రతికూలంగా యున్నది. ఈ విధముగా వానర లక్ష్మణ సమేతుడై శ్రీరాముడు సమరోత్సాహముతో దక్షిణ సముద్రమున యున్న మహేంద్ర పర్వతమును సమీపించిరి. సముద్రము యొక్క ఆవలి ఒడ్డు కానరానిదై అపారంగా యుండెను. శ్రీరాముని అనుమతితో సుగ్రీవుడు వానర సేనలను సాగర తీరము నందు నిలిపెను. సీతావియోగముచే లోకరీతికి భిన్నముగా శ్రీరాముని దుఃఖము అధికమయ్యెను.
 
న మే దుఃఖం ప్రియా దూరే న మే దుఃఖం హృతేతి చ      
ఏత దేవా౭నుశోచామి వయోఽస్యా హ్య౭తివర్తతే            6.5.5
 
వాహి వాత యతః కాంతా  తాం స్పృష్ట్వా మా మ౭పి స్పృశ
త్వయి మే గాత్ర సంస్పర్శ శ్చన్ద్రే దృష్టి సమాగమః          6.5.6
 
సీతమ్మ యవ్వనము రోజు రోజుకి గడచి పోవుచున్నదని, ఆమెను స్పుశించి, తనను స్పృశించమని వాయువును, చంద్రుడిని ప్రార్థించుచున్నాడు.
యుద్ధ కాండము నందలి రెండు, మూడు, ఐదవ సర్గలు ఇట్టి సీతా శోకముచే నిండి శ్రీరాముడు అతి సాధారణ మానవుని వలె వర్ణింపబడినాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ
ప్రాంజలి ప్రభ .. మల్లాప్రగడ రామకృష్ణ 
--(())--

Thursday, 16 January 2020

యుద్ధ కాండము-1 శ్రీరా0 ***

ఆధ్యాత్మికానందారోగ్యజ్ఞాన  పత్రిక ..... 25/1 ( 
 యోగవాసిష్టం: శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము-1
శ్రీరాముడు హనుమను ఆలింగనము చేసుకొనుట
హనుమ సముద్రమును దాటి సీతమ్మను చూచి, లంకను చెరచి మరల అనాయాసముగా వెనుకకు వచ్చి శ్రీరామునితో తన సాగర లంఘనమును, సీతాన్వేషణ వృత్తాంతమును యథాతథముగా వివరించాడు. నియమించిన కార్యమును చక్కగా నెరవేర్చుకొని  వచ్చినప్పుడు ప్రభువు ఎట్లు ప్రవర్తించ వలెనో వాల్మీకి శ్రీరాముని ద్వారా  లోకమునకు తెలియ చేయుచున్నాడు.  గురువులను ప్రత్యక్షంగా స్తోత్రము చేయవలెను. మిత్రులను, బంధువులను పరోక్షంలో స్తుతించవలెను. దాసులను, భృత్యులను నియమించిన పని పూర్తి చేసిన వెంటనే ప్రశంసింప వలెను. పుత్రులను ఎన్నటికీ బైటికి ప్రశంసింప రాదు. మనసులోనే అభినందించు కొన వలెను. (ప్రస్తుతము తద్విరుద్ధముగా జరుగుట చూచుతున్నాము). ఈ నియమమును ఎరిగిన శ్రీరాముడు నియమించిన కార్యమును నెరవేర్చిన హనుమను సుగ్రీవుడు, వానరులు చూచుచుండగా ఇట్లు చెప్పు చున్నాడు.
 

కృతం హనుమతా కార్యం సుమహ ద్భువి దుష్కరమ్
మనసా౭పి య ద౭న్యేన న శక్యం ధరణీ తలే 6.1.2
 

ఈ భూమండలమున ఎవరును మనసులో కూడా చేయజాలని పనిని, చాలా గొప్ప పనిని హనుమ చేసినాడు. ఈ లోకములో వాయువు సహాయము ఉన్నచో గరుత్మంతుడు సాగరమును దాటగలడు. కానీ హనుమ ఎవరి సహాయము లేకుండా అట్టి దుష్కార్యమును నెరవేర్చినాడు. రావణుని పర్యవేక్షణలో యున్న దుర్భేద్యమైన లంకను పాడు చేయడము హనుమకు తప్ప ఎవ్వరి వలన సాధ్యమయ్యేది కాదు.  తన బలమునకు అనుగుణముగా, సేవకుడిగా తాను చేయవలసినది అంతయు చేసినాడు. ప్రభువును సేవించెడి భృత్యులు మూడు విధములుగా యుందురు. కార్యమును ప్రభువు నియోగించినప్పుడు ఆపనిని చేసి అనిని చేసిన దానికి సంబంధించిన వేరొక పనిని కూడా ప్రభు కార్యమునకు అనుకూలముగునట్లు చేయువారు రాజభృత్యులలో ఉత్తములు. అధికమైన సమర్థత యుండియు నియమించిన కార్యమును మాత్రమే చేయువాడు మధ్యముడు. సామర్థ్యము ఉండియు చేయవలెనని సిద్ధపడియు చేయక, చేయలేక పోయినవాడు అధముడు. హనుమ సీతాన్వేషణ, లంకాదహనము చేసి అందరిని ప్రాణత్యాగము చేయకుండా కాపాడినాడు. హనుమ, సేవకులలో ఉత్తముడు. అతను చేసిన ఉపకారమునకు ఏమి ఇచ్చి ప్రత్యుపకారము చేయగలను?

ఏష సర్వస్వ భూత స్తు పరిష్వ౦గో హనూమతః
మయా కాల మిమం ప్రాప్య దత్త స్తస్య మహాత్మనః      6.1.13
 

సాగరం తు సమాసాద్య పున ర్నష్టం మనో మమ          6.1.16
కథం నామ సముద్ర స్య దుష్పార స్య మహా౭మ్భసః
 

హరయో దక్షిణం పారం గమిష్యన్తి సమాహితాః 6.1.17
య ద్య౭ప్యేష తు వృత్తాన్తో వైదేహ్యా గదితో మమ
 

ప్రత్యుపకారము చేయవలసిన ఈ సమయమున నా వద్ద యున్నది దేహమే. ఇది నాకు అత్యంత ప్రియమైనది. నాకు ఎంతో భోగ్యమైనది. ఈతనికి ఏమి ఇచ్చినను స్వీకరింపడు. ఆనాడు లంకలో చనిపోవుటకు సిద్ధపడిన సీతమ్మను కాపాడినాడు. సీతాసందేశముతో నా ప్రాణములు కాపాడినాడు. ఈ విధముగా రెండు దేహములను కాపాడినాడు. కాన ఈ దేహముతో హనుమను ఆలింగనము చేసుకొనెదని, హనుమను గాడాలింగనం చేసుకొనెను. కాని అగాధమైన ఈ సముద్రమును దాటుట ఎట్లు అని దీర్ఘాలోచనలో పడిపోయినాడు.
 

శ్రీరాముడు శోకముతో యుండుట చూచి సుఖదుఃఖములలో మిత్రుడిగా రాముని శోకమును రూపుమాపుటకు సుగ్రీవుడు ఇట్లు శాంత, ధైర్య వచనములు పలుకుతున్నాడు. "రామా! సామాన్యుని వలెనే నీవు శోకించుట తగదు. సంతాపమును విడువుము. సీతమ్మ జాడ తెలిసినది. శత్రువు స్థావరం తెలిసినది. ఏది చేయరాదో, చేయదగునో నిర్ణయించ శక్తి గల బుద్ధిమంతుడవు. సముద్రమును దాటుట దుర్భరమని శోకింపకుము. అట్టి సముద్రమును దాటి లంకపై దూకి, రావణుని మేమందరము సంహరించ గలము.  నిరుత్సాహము సర్వ కార్య వినాశకరం.
 

నిరుత్సాహ స్య దీన స్య శోక పర్యాకులా౭౭త్మనః
సర్వా౭ర్థా వ్యవసీదన్తి వ్యసనం చా౭ధిగచ్ఛతి     
 

ఉత్సాహము లేనివాడు, దీనుడు, శోకముచే కలత చెందిన వాడు కార్యములను సాధింపజాలడు. సర్వార్థములు చెడిపోవును. ఆపదలు చుట్టుముట్టును. సర్వ ప్రయోజనములు నశించును. శోకము వలన నిరుత్సాహము ఏర్పడును. అందువలన దైన్యము వచ్చును. అప్పుడు పొందవలసిన ప్రయోజనము పొందకపోవుట వలన ఆపద వచ్చును. కావున సర్వదా శోకము దూరము చేయదగినది. రామా! మీ ఆజ్ఞచే ఉత్సాహవంతులైన అశేష మా వానర సేనాని సముద్రమును దాటుటయే కాదు అగ్నిలో దూకమన్న దూకేస్తారు. సముద్రమునకు సేతువు కట్టుటకు, లంకను చేరుటకు మీరు ప్రయత్నము చూపవలెను. ఇందుకు అనేకమైన సూచనలు కనబడుతున్నాయి. ఈ విధముగా సుగ్రీవుడు శ్రీరాముని శోకము బాపుటకు ప్రయత్నము చేసెను.
ఈ సాగరము దుస్తరమైన సంసార రూప సాగరము. అటువంటి సాగరమును దాటి లంకకు పోయి సీతను వెతికి, తిరిగి వచ్చునప్పుడు నియంత్రణలో యున్న ఆ లంకను హనుమాన్ సాధకుడు దహనము గావించెను. అనగా మాయను దహింప చేసెను.
 

"కింత్వం సంతర్యసే వీర యథాన్య: ప్రాకృత స్తథా,
మైవం భూస్త్యజ సంతాపం కృతఘ్న యువ సౌహృదం"  6 2 2 
 

సుగ్రీవుడు, శ్రీరామునితో సీతారూప సాత్విక అనుభూతుల కొరకై సాధారణ మానవుని వలె శోకమును పొందకుము అని చెప్తాడు. శ్రీకృష్ణుడు కూడా ఈ విధముగానే అర్జునునితో శోకము చెంద వద్దని చెప్పాడు.
 

"మయి సర్వాణి కర్మాణి సన్య స్యాధ్యాత్మ చేతసా
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్య స్వ విగత జ్వరః" (3 30 )

ఈ శ్లోకములో శ్రీకృష్ణుడు అర్జునిడికి సంతాప రహితముగా యుండుమని చెప్తాడు. సుగ్రీవుడు "త్యజ సంతాపః" అంటారు. అంటే సంతాపమును త్యజింపమని పలికెను. సాధనా ఫల ప్రాప్తి నొందనిచో సాధకుని మనోబుద్ధుల సంతాపము వృద్ధి యగును. అటువంటి సంతాపమును దరిచేరనీయరాదు. ఈ దుర్లభమైన సాగరమును దాటుటెట్లు అని చింతించుచున్న రామునితో సుగ్రీవుడు అను చున్నాడు.
 

సముద్రం ల౦ఘయిత్వా తు మహా నక్ర సమాకులమ్
ల౦కా౦ ఆరోహయిష్యామో హనిష్యామ శ్చ తే రిపుమ్ 6 2 5
 

పెద్ద పెద్ద మొసళ్ళతో (శత్రువులతో) నిండియున్న సాగరమును (సంసారమును) దాటి లంకకు చేరి రాక్షసులను సంహరించ వలెను. సాగరమనగా దుర్గుణములతో కూడిన భవసాగరము. అదియే సంసార సాగరము. లేదా సంసారము. రావణాది రాక్షసులు అనగా చెడ్డ వృత్తులు. వీటిని సాధకుడు సంహరింప వలెను. వసిష్ఠ మహర్షి శ్రీరామునితో, దృశ్యాస క్తి యే సంసారము యొక్క మూల రూపము. సంసార అసక్తుడైన వాడు అనుభవించని దుఃఖము అంటూ వుండవు. సమ్యక్ జ్ఞానము జీవుని సంసార వ్యాధికి దివ్యమైన ఔషధము. సంసారమనెడు ఈ వాసనను చేధింపుము అని చెప్తారు. సుగ్రీవుని సంభాషణ ద్వారా వాల్మీకి సాధకుడు తన యందలి చెడ్డ వృత్తులను వదలి ఈ సంసార సాగరమును దాటవలెనని చెప్పాడు. అయినను రాముడు సీతా శోకమును నియంత్రణలో పెట్టుకోలేక పోయెను. శ్రీరాముడు వాల్మీకిచే రూపొందించబడిన ఆదర్శ పురుషుడు. పూర్వపు అనుభూతులు ప్రాప్తించక పోయినచో సాధకుడు గాబరా చెందును. ఈ సీతా శోకమున యున్న యోగ రహస్యము ఇదియే. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి రామ శోకము గురించి ఈ విధముగా చెప్పెను. "రామః పరాత్మా ఫై తతః స్వానుభూతిమ్ వియోగతః, ప్రాప్తో దీన దశాం దుఖిః సుశోచ విరహాతుర:" ఈ సీతాశోకము చూచినచో రాముడు అతి సాధారణ మానవునివలె వర్ణింపబడినాడు. మంచి ఎవరు చెప్పిన వినాలనే శృతి వాక్యమును శ్రీరాముడు పాటించి ఆదర్శ పురుషుడు అయ్యాడు. కానీ రావణుడు తనకు నచ్చినట్లు చెప్పే వారి మాటలే విని, మంచి మాటలు స్వీకరింపక పతనమును కోరి తెచ్చుకొన్నాడు.
శ్రీరామ జయరామ జయజయ రామ

ప్రాంజలి ప్రభ " మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
--(())--

Wednesday, 15 January 2020

యుద్ధ కాండము



[6:14 AM, 1/16/2020] యోగవాసిష్టం: మిత్రులకు, శ్రేయోభిలాషులకు కనుమ పండుగ శుభాకాంక్షలు
శ్రీరాముడు-యోగరహస్యము-యుద్ధ కాండము- విచారణ
మానవుడు కామక్రోధాలుతొ చుట్టబడి ఉంటాడు. అహంకారంతో ఆవేశింపబడి ఉంటాడు. అనేక రకాలైన మాయాజాలంతో చుట్టుకొని ఉంటాడు. ఇతడు నవరంధ్రాలు ద్వారా, పైన ఉండే పదో రంద్రం ద్వారా "పది తలకాయలతోటి" కోరికలను అనుభవిస్తూ యుంటాడు. అతడే దశకంఠుడైన రావణాసురుడు. ఎనిమిది దిక్కులు, పైన, క్రింద కలసి పది దిక్కులు కోరికలు, కామము ప్రజ్వరిల్లి శరీరముతో ఉండే అవిద్యా సంబంధమైన రాజ్యాన్ని పరిపాలించేవాడే దశకంఠుడు. తపస్సుతో వేద జ్ఞానము సాధించాననే అహంకారము. కాని అహంకారమును జయించలేక పోయాడు. రవైతీతి రావణః బిగ్గరగా తన జ్ఞానమును అందరికి చాటును. జీవుడు ఆత్మజ్ఞానం కలుగక సంసార సాగరము చేత చుట్టబడి ఉండుటచేత అతని ఉనికి లంకాపురి అన్నారు. అటువంటి లంకాధీశునికి పరమాత్మ సాన్నిధ్యము కలగాలంటే ఈ సంసార సాగరాన్ని దాటి అతనికి భగవత్ సందేశము అందించే వారు కావాలి. కోరికలతో యుండి అవిద్యలో ఉన్నవానికి భగవంతుడి సాన్నిధ్యము కావాలంటే సాధన కావాలి. అంటే ప్రాణాయామ, ప్రత్యాహార మొదలగు అష్టాంగ యోగాలుతో శ్వాసను బంధించాలి (ఈ విషయము ఉపోద్ఘాతములో చెప్పుకొన్నాము). శ్వాస నిగ్రహము అంటే వాయువు మీద జయం. అప్పుడు గాని పరమాత్మ సాన్నిధ్యము లభ్యము కాదు. ఇక్కడే రామ రామ అంటూ ఉచ్చ్వాస, నిశ్వాస లతో వ్యవహరించే వాయుపుత్రుడైన హనుమ ప్రవేశిస్తాడు. ఈ వాయుపుత్రుడే ప్రాణ స్వరూపుడు. "రా" అంటే "రావణ" "మ" అంటే "మర్దన", ఎవరైతే "రామ రామ" అని అంటారో వారు రావణ మర్దన కోరుతున్నట్లు. బ్రహ్మ భావము నందు సదా చరించే వాడు వాయుపుత్ర హనుమ. ఉచ్చ్వాస, నిశ్వాసల ద్వారా బ్రహ్మాండము లోని ప్రాణాన్ని (శ్వాస లేక ప్రాణవాయువు) తీసుకొని, అట్టి ప్రాణాన్ని తిరిగి బ్రహ్మాండము లోనికి ప్రవేశపెట్టడం ద్వారా  ఇటు శరీరములోని జీవాత్మతోను అటు బ్రహ్మాండములోని పరమాత్మతోను సంబంధము నడిపేదే శ్వాస. అదియే దూత అయిన హనుమ. అందుకనే ఇతనికి "రామదూత" అని కూడా పేరు. ఈ రామదూత చేసేటటువంటి   ప్రాణాయామమే "సాగర లంఘనము". ఈ విధముగా జీవాత్మ, పరమాత్మల సంబంధము ఏర్పడినప్పుడు సంసార సాగరముతో చుట్టబడిన లంకలో ప్రవేశించి పరమాత్మ అయిన రాముని క్షేమము తెలియ చేస్తాడు.
యోగి ప్రాణాయామము చేసినప్పుడు అతనికి భ్రూమధ్యమములో, రెండు కళ్ళ మధ్య ఉండే ఆజ్ఞాచక్రములో కాంతి చక్రమైన ఒక జ్యోతి దర్శనము అవుతుంది. అదియే సీతమ్మకు చూపిన రాముని అంగుళీయకము. అంటే పరమాత్మ ఉనికిని ఋజువు చేస్తాడు. అప్పుడు జీవుడు ఊరట చెంది భగవత్ సాన్నిధ్యము కలుగబోతున్నది అను భావన కలుగును. జీవుడు ప్రాణాయామము ప్రారంభించుట తోడనే శరీరములోని దోషములన్ని తపింపబడి అగ్నిలో జాజ్వల్యమానంగా మండిపోతాయి. అదియే హనుమ లంకా దహనము. ఎప్పుడైతే శరీరములోని పాపపురుషుడు దహింపబడతాడో అప్పుడు జీవాత్మకు పరమాత్మకు సంబంధము అనే నిచ్చెన ఏర్పడును. తద్వారా జీవుడు భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలడు.  అదియే లంకకు కట్టిన సేతువు. అప్పుడు నిరంతర యోగసాధన, సత్యనిష్టలతో భగవంతుడుగ రూపాంతరము చెందిన  రాముడు సంసార సాగరమైన లంకలోకి ప్రవేశించి,  జీవ, బ్రహ్మల భావన కలుగ జేసి జీవుడితో (సీతతో) ఐక్యం పొందుతాడు. అప్పుడు అవిద్యా పురుషుడైన దశకంఠుడు నశించి సీతారాముల అంటే జీవ, పరమాత్మల ఐక్యం జరుగును. ఈ ఐక్యత నిజమా! కాదా! అంటే కష్టాలకు, సుఖాలకు చలించకుండా ఉండేటటువంటి బ్రహ్మానుభూతి. అదియే సీత యొక్క అగ్ని పరీక్ష. ఈ విధముగా రామాయణము అంతా ఒక యోగ రహస్యము, ఒక ఆధ్యాత్మిక సాధన. ఒక ఆంతరంగిక రహస్యము. ఇదియే రామాయణ రహస్యము.
రేపటి నుంచి యుద్ధ కాండలో ఏ విధంగా సాత్విక అహంకార రూప విభీషణుని సహాయంతో రాముడు తామస రూప అహంకార కుంభకర్ణుని, రాజస రూప అహంకార రూప రావణాదులను నాశనము గావించి బ్రహ్మరూప సాత్విక అహంకారియైన రావణ బంధము నుండి స్వానుభూతి రూప సీతను విడిపించుకొని రాముడు తన వృత్తి రూపమైన సీతతో ఇంటికి తిరిగి వచ్చి స్వరూప సామ్రాజ్య రూప సింహాసనాభిషిక్తుడగునో తెలుసు కొనుటకు ప్రయత్నము చేయుదము.
శ్రీరామ జయరామ జయజయ రామ
 
ప్రాంజలి ప్రభ.. మల్లా ప్రగడ 

సుందర కాండము-24

మిత్రులకు, శ్రేయోభిలాషులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-24
 
హనుమ సీత దేవి సమాచారమును శ్రీరామునకు చెప్పుట
వానరులు అంగదుని ముందుంచుకొని సీతమ్మ రావణాంతఃపురములో నిర్బంధించబడి యుండుటయు, రాక్షస స్త్రీలచే భయపెట్టుచుండుట, సీతమ్మకు రాముని యందు అనురాగము, రావణుడు ఆమెకు రెండు నెలల గడువు ఇచ్చుట మున్నగు విషయములు రామునికి తెలిపి సీత కుశలముగా యున్నదని చెప్పిరి. అప్పుడు రాముడు సీత విషయమై సవిస్తరంగా చెప్పవలసినదిగా కోరగా, హనుమ సీత యున్న దిక్కుకు నమస్కరించి ఇట్లు చెప్పుట ప్రారంభించెను.
"సముద్రమునకు దక్షిణ తటమున దురాత్ముడైన రాక్షస రాజు రావణుని లంకా నగరము కలదు. నేను నూరు యోజనముల సముద్రమును దాటి అట్టి లంకలో సీతమ్మను చూచుటకు బయిలుదేరితిని. అచట రామా! నీ యందే సర్వమును ఉంచుకొని జీవించుచున్న సీతమ్మను నేను చూచితిని. బహు దుఃఖమును పొంది యున్నది. రావణాంతఃపురమున నిరోధింపబడి రాక్షస స్త్రీలచే రక్షింపబడుచున్నది. ఒంటి జడ దాల్చి దీనురాలై నిన్నే ధ్యానించుతు నేలన పరుండి యున్నది. రావణాసురునుని పొందవలెనని కోరిక లేనిదై, భీతిల్లి మరణించుటకే నిశ్చయించుకొన్నది. అట్టి స్థితిలో నేను సీతను చూచితిని. ఇక్ష్వాకు వంశమును కీర్తించి ఆమెకు నాపై నమ్మకమును కల్గించుకొంటిని. తరువాత మాటలాడి జరిగిన విషయమును అంతయు తెలిపితిని. రామసుగ్రీవుల మైత్రికి ఎంతయో సంతోషించింది. చిత్రకూటమున జరిగిన కాకాసుర వృత్తాంతమును నీకు గురుతుగా చెప్పమన్నది. రామా! సీతమ్మ ఈ మణిని దాచి పదిలంగా నీకు ఈయమని చెప్పినది. మణిశిలల గంధముతో బొట్టు పెట్టిన సంగతి జ్ఞాపకము చేయమన్నది. ఒక మాసము గడిచిన తర్వాత జీవించి యుండను అని చెప్పి యున్నది. రామా! చూచిన దానిని చూచినట్లు వివరించితిని. సముద్రమును దాటుటకు ప్రయత్నము చేయుడు" అని చెప్పి చూడామణిని శ్రీరామునికి సమర్పించెను.  
హనుమ తాను వెళ్లి వచ్చిన వృత్తాంతమును వానరులకు, రామునికి తెలియ జేసెను. అందు భేదము గుర్తించాలి. వానరులతో తన విజయములను వర్ణింపక సీతమ్మకు సంబంధించిన వృత్తాంతమును మాత్రమే చెప్పెను. రాముని వద్ద అహంకారము వ్యక్తము కాకుండా వినయముతో రామునికి ఆవశ్యకమగు విషయమును మాత్రమే చెప్పెను. ఇది హనుమ యొక్క వినయమును, ఉచితజ్ఞతను సూచించు చున్నది.
శ్రీరాముడు ఆ మణిని హృదయమునకు హద్దుకొని సుగ్రీవునితో ఈ మణిని చూడగానే మా తండ్రియైన దశరథుడు, మామగారైన జనకుని చూచినట్లు యున్నది. ఈ మణిని సీత ధరించినప్పుడు ఆ మణి శోభలు ఇనుమడించెను. ఈ మణిని చూచి నేను ఆమెను పొందినట్లుగా భావించుచున్నాను.  "చిరం జీవతి వైదేహీ యది మాసం ధరిష్యతి, క్షణం సౌమ్య న జీవేయం వినా తా మ౭సితేక్షణామ్" సీతమ్మ నెలరోజులు బ్రతికినచో చాలా కాలము జీవించునన్నమాట. ఇక ఆమెను చూడక క్షణకాలం జీవింపలేను. హనుమా! ఆమె అన్న మాటలు యథార్థముగా చెప్పుము. రోగికి మందువలె ఆమె మాటలే నాకు జీవనము. "మధురా మధురా౭౭లాపా కి మా౭౭హ మమ భామినీ, మ ద్విహీనా వరారోహా హనుమన్ కథయస్వ మే" సీతమ్మ మధురము. ఆమె మాటలు మధురము. ఆమె మాటలు చెప్పుచున్న నీ మాటలు మధురము. ఇంకా సీతమ్మ ఏమనినదో చెప్పుము.
అప్పుడు హనుమ రామునితో, రామా! జానకీదేవి చిత్రకూటమిన జరిగిన కాకాసుర వృత్తాంతము యధాతధముగా నివేదించమన్నది. అస్త్రకోవిదులలో అగ్రగణ్యుడు, మహాబలశాలి అయినా శ్రీరాముడు నా విషయమున కనికరము యున్నచో వెంటనే రావణుని హతమార్చ వలెను. శత్రు భయంకరుడైనట్టి లక్ష్మణుడు అయినను నన్ను రక్షించుటకు ఏల వచ్చుట లేదు? వారు విస్మరించుటకు నాలో ఏమైనా దోషములు యుండవచ్చును. దిగులుగా యున్న సీతతో హనుమనైన నా వీపు ఎక్కినచో శీఘ్రముగా రామలక్ష్మణుల కడకు చేరుతును అని చెప్పాను. కానీ అది ధర్మము కాదని, కాలము ప్రతికూలమగుట వలన ఇదివరలో నిస్సహాయరాలునై రావణునితో తాకబడితిని అని చెప్పెను. ఇంకను మీ కుశలం అడిగినది అని చెప్పెను. ఇంకను ఈ మహాసముద్రమును దాటుటకు గరుత్మంతునికి, వాయువుకు, హనుమనైన నాకు మాత్రమే సాధ్యము కావున తగు ఉపాయమును ఆలోచింపమన్నది. ఈ కార్యమును సాధించుటకు నీవు ఒక్కడివే చాలును. కానీ అందువలన శ్రీరాముని ప్రతిష్ట పెరగదు అనియు చెప్పెను. శ్రీరామునికి భయపడి వంచనతో రావణుడు నన్ను అపహరించెను. కానీ ఇప్పుడు రావణుని కన్నుగప్పి నన్ను తీసుకొనిపోవుటకు రాముడు ఇష్టపడడు, కావున రణరంగమున రావణుని హతమార్చి నన్ను తీసుకొని వెళ్ళుట శ్రేయస్కరము అనెను. అప్పుడు హనుమనైన నేను సుగ్రీవుని వానర భల్లూక సైనికులలో చాలా అల్పుడను. కావుననే నన్ను దూతగా పంపినారు. నాకన్నా బలవంతులు చాలా మంది కలరు అని చెప్పాను. కావున నీ శోకము త్వరలో తీరును అని అనునయించి వచ్చితిని.
సుందర కాండ సమాప్తము.
శ్రీరామ జయరామ జయజయ రామ
హనుమ పలికిన మంగళకరములగు వాక్కులచే సీతమ్మకు మనస్సున శాంతి లభించినట్లే ఈ కాండను చదివిన వారికి మన…