Wednesday 1 January 2020

సుందర కాండము-11



శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-11
త్రిజట స్వప్నము
సీతాదేవి ఆ రక్కసుల మాటలకు మిగుల పరితాపము చెందుచు ..

హా రామేతి చ దుఃఖా౭౭ర్తా పున ర్హా లక్ష్మణేతి చ
హా శ్వశ్రు మమ కౌసల్యే హా సుమిత్రేతి భామినీ 5 25 11
 
లోక ప్రవాదః సత్యో౭యం పణ్డితైః సముదా౭౭హృతః
అకాలే దుర్లభో మృత్యుః స్త్రియా వా పురుష స్య వా      5 25 12           
 
య త్రా౭హ మేవం క్రూరాభీ రాక్షసీభి: ఇహా౭ర్దితా
 
జీవామి హీనా రామేణ ముహూర్తమ్ అపి దుఃఖితా         5 25 13
ధిగ్ అస్తు ఖలు మానుష్యం ధిగ్ అస్తు పర వశ్యతామ్
న శక్యం యత్ పరిత్యక్తుమ్ ఆత్మ చ్ఛన్దేన జీవితమ్    5 25 20
 
సీతాదేవి రామా, లక్ష్మణా, కౌసల్యా, సుమిత్రా అనుచు దుఃఖించెను. స్త్రీ, పురుషులలో ఎవ్వరికైనను తాము కోరుకొన్నప్పుడే మరణము సంభవించదు అను ప్రాజ్ఞుల మాట సత్యము. ఇట్టి రాక్ష స్త్రీలచే బాధింపబడుతూ ఒక్క క్షణమైనను జీవించి యుండరాదు. మరల స్వస్థత తెచ్చుకొని నా జీవితము శ్రీరాముని అధీనములోనిది కావున ఈ జీవితమును త్యజించుటకు నాకు అవకాశము లేదు[1].  ఈ విధముగా జానకి అధోముఖియై నిరంతరము కన్నీరు కార్చుచు విలపించుచుండెను. అప్పుడు ఆ రాక్షస స్త్రీలలోని త్రిజట తనకు కలిగిన స్వప్న వృత్తాంతము చెపుతూ శ్రీరాముని విజయము, రాక్షసుల వినాశనం సూచించింది అని చెపుతుంది.
 
చన్ద్ర సూర్యౌ మయా దృష్టా పాణిభ్యాం పరిమార్జతీ
తత స్తాభ్యాం కుమారాభ్యామ్ ఆస్థితః స గజోత్తమః       5.27.16
 
సీతయా చ విశాలా౭క్ష్యా ల౦కాయా ఉపరి స్థితః
పాణ్డు రర్షభ యుక్తేన రథే నా౭ష్ట యుజా స్వయమ్        5.27.17
 
ఆ స్వప్నములో ఏనుగు అంబారీపై శ్రీరామునితో గూడి సీత ఊరేగుచుండగా, సీత తన పతి యొడినుండి లేచి సూర్యచంద్రులను స్పృశించుచుండుట చూచితిని. (ఆదిత్య మండలం వాతు, చంద్రమండలం మేవ వా| స్వప్నే గృహ్ణతి హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్నుయాన్మహాత్|| ఆరోహణం గోవృషకుంజరాణాం ప్రాసాదశైలాగ్ర నానస్పతీనాం| స్వప్నమున సూర్యమండలముగాని, చంద్రమండలముగాని తన చేతులతో స్పృశించిన మహారాజ్యము ప్రాప్తించును. ధ్రువమండలము, శైలాగ్రమునకు చేరుకొనుట, గజారోహణము తప్పకుండ సంపదలు కల్గును). త్రాగుచు, యెర్రని  వస్త్రములు ధరించి, నూనె పూయబడిన దేహముతో గన్నేరు దండలు దాల్చి   పుష్పకముపై నుండి రావణుడు పడిపోవుటను స్వప్నములో గాంచితిని. (బలి పశువు మెడలో గన్నేరు దండలు అలంకరించుట ఆచారము). శ్రీరాముడు దివ్యమైన పుష్పక విమానమును ఎక్కి ఉత్తర దిశకు సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లెను. (ఈ విషయము అనంతరము శ్రీరాముడు అయోధ్యకు రాజుకాగలడని సూచిస్తున్నది).రావణుడు శిరోముండనం గావించుకుని, నల్లని వస్త్రములు ధరించి, నూనె త్రాగుచు, పిచ్చివాడివలె గాడిదలు కట్టిన రథముపై దక్షిణ దిశకు వెడలెను. రావణుని సుతులు, కుంభకర్ణుడు నూనె పూసిన దేహములతో దక్షిణ దిశకు వెడలిరి. ఒక్క విభీషణుడు మాత్రము దివ్య గజమును అధిరోహించి ఆకాశమునందు యుండెను. ఈ విధముగా త్రిజట తన స్వప్న వృత్తాంతమును తెలిపి రాక్షస స్త్రీలతో సీత యెడల జాగరూకతతో, మర్యాదగా మెలుగుడు, ఆమెను శరణు వేడుడు అని చెప్పింది. అంత సీతకు శుభశకునములు కంబడినవి.
శ్రీరామ జయరామ జయజయ రామ
 
[1] మానవ జన్మను ఇచ్చినది భగవంతుడు, కావున ఇది భగవధీనమైనది. కావున జీవితమును త్యజించుటకు  ఎవ్వరికిని అధికారములేదు కావున ఎవ్వరును ఆత్మహత్యకు పాల్పడరాదు.

No comments:

Post a Comment